ప్రభుత్వం పంట నష్టం వివరాలను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తోందని.. వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం మునగాల, కూనవరం గ్రామాల్లో నీటిలో మునిగిన పంటలను ఆయన పరిశీలించారు. కోరుకొండ, సీతానగరం మండలాల్లో గత 2, 3 నెలల్లో వచ్చిన వరదలకు జరిగిన పంట నష్టం వివరాల నివేదిక రూపొందించి.. రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తుపాన్ల వల్ల తూర్పుగోదావరి జిల్లాలో అధిక పంట నష్టం వాటిల్లిందని నాగిరెడ్డి అన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చిన వరదల వల్ల జరిగిన నష్టాల నివేదికలను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించిందని తెలిపారు. ఈ 2 నెలల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో వేసిందని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో నష్టపోయిన రైతులు, పంట నష్టం వివరాలు ప్రదర్శించిందని చెప్పారు. నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యతగా భావిస్తోందన్నారు.