తూర్పుగోదావరి జిల్లా లంక గ్రామాల ప్రజలకు వరద కష్టాలు మొదలయ్యాయి. ధవళేశ్వరం బ్యారేజి నుంచి దిగువకు లక్షా 10 వేల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు విడిచిపెట్టారు. నీటి విడుదలతో నాలుగు గ్రామాల్లో నీటి ప్రవాహం కొనసాగుతోంది. పి.గన్నవరం నియోజకవర్గంలోని... వుడుముదిలంక, జీ.పెదపూడి లంక, అరిగెలవారిపేట, బూరుగు లంక గ్రామాలు గోదావరి నదికి దగ్గర్లో ఉన్నాయి.
ఈ గ్రామాల్లో వశిష్ఠ గోదావరి నదికి అనుసంధానంగా ఉన్న పాయలోకి... వరద నీరు పోటెత్తడంతో రహదారి తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. లంక గ్రామాల ప్రజలు ప్రస్తుతం నాటు పడవలు ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. అక్టోబర్ వరకు వరద కష్టాలు తప్పవని గ్రామస్థులు వాపోతున్నారు. ఇక్కడ వంతెన నిర్మించాలని నాలుగు దశాబ్దాలుగా మొరపెట్టుకున్నా... అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వంతెన నిర్మాణం చేపట్టాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.