ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 5, 2019, 5:47 AM IST

ETV Bharat / state

శ్రీవారి బ్రహ్మోత్సవం... నమ్మిన బంటే 'వాహనం'

బ్రహ్మోత్సవం... వీక్షించిన భక్తులకు నేత్రోత్సవం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు తాను నమ్మిన బంటైన హనుమద్వాహనంపై శ్రీ వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రికి గజ వాహనంలో తిరు మాడ వీధుల్లో ఊరేగనున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవం

శ్రీవారి బ్రహ్మోత్సవం... నమ్మిన బంటే 'వాహనం'

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు... కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఐదు రోజుల్లో తొమ్మిది వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చిన మలయప్ప స్వామి... నేటి ఉదయం హనుమద్వాహనంపై దర్శనమివ్వనున్నారు. శ్రీ రామచంద్రమూర్తి అలంకార ప్రాయుడై... కోదండం చేతపట్టిన శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.

నమ్మిన బంటే వాహనంగా

శ్రీ రాముని నమ్మిన బంటైన ఆంజనేయుని వాహనంపై శ్రీనివాసుడు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తిరు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు. భక్తికి ప్రతీకైన హనుమంతుణ్ని... ధర్మానికి మారుపేరైన కోదండ రాముని దివ్యమంగళ స్వరూపాన్ని వెంకటేశ్వరునిలో దర్శించుకునే అవకాశం కలిసి రావడం నిజంగా ప్రత్యేకతేనని ఆగమ పండితులు అభివర్ణిస్తున్నారు.

రాత్రికి గజ వాహన సేవ

శ్రీవారికి హనుమద్వాహన సేవ ముగిసిన అనంతరం ఉభయ నాంచారుల సమేతుడైన మలయప్పస్వామి బంగారు తేరుపై ఊరేగనున్నారు. స్వర్ణ రథంపై విహరిస్తున్న కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకునేందుకు రెండు కళ్లు చాలవు. అత్యంత వైభవంగా జరిగే ఈ రథ రంగ డోలోత్సవానికి సంబంధించి తితిదే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రికి స్వామి వారికి గజవాహన సేవ కన్నుల పండువగా జరగనుంది. 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ సేవలో స్వామి గజరాజు వాహనంపై ఆసీనులై నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామి వారికి అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాల కోసం తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుదూర ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇదీ చూడండి:

గరుడ గమనుడై అరుదెంచె... గోవిందుడు..!

ABOUT THE AUTHOR

...view details