కరోనా మహమ్మారి కారణంగా నిన్నమొన్నటి వరకు మందకొడిగా సాగిన ఆర్టీసీ సర్వీసులు వేగం పుంజుకుంటున్నాయి. ప్రత్యేకించి రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన తిరుపతి ఆర్టీసీ పరిధిలో బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచారు. సంక్రాంతి పండుగలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు రద్దీకి అనుగుణంగా సర్వీసులు తిప్పేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇన్నాళ్లు తక్కువ సర్వీసులు కారణంగా భారీగా ఆదాయాన్ని కోల్పోయిన ఆర్టీసీ...తిరిగి గాడిన పడేలా అవకాశాలను అందిపుచ్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు
తమిళనాడు, కర్ణాటక సహా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీనివాసుడి దర్శనాల కోసం వచ్చే భక్తులతో కిటకిటలాడిపోయే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం కరోనా మహమ్మారి కారణంగా ప్రాభవాన్ని కోల్పోయింది. భారీగా ఆదాయాన్ని తీసుకువచ్చే సర్వీసులన్నీ చాన్నాళ్లుగా నిలిచిపోవటంతో లాభాలను అసలేమాత్రం కళ్లచూడని పరిస్థితులు నెలకొన్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లోని మూడు ప్రాంగణాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తిరిగి పునర్వైభవాన్ని సాధించే దిశగా తిరుపతి ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం సంక్రాంతి సీజన్ నుంచే తిరిగి గాడిన పడేందుకు సర్వీసులను పునరుద్ధరిస్తోంది.
సంక్రాంతి సీజన్ ను దృష్టిలో పెట్టుకున్న అధికారులు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా సర్వీసులపై దృష్టి సారించారు. ఎక్కువగా తిరుపతి- విశాఖపట్నం, తిరుపతి- అనంతపురం, తిరుపతి- కడప మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు సంక్రాంతికి ముందు ఆయా మార్గాల్లో 100 సర్వీసులను, పండుగ సెలవుల తర్వాత 200 సర్వీసులను నడపాలని నిర్ణయించారు.