నాటు బాంబు పేలి గాయపడిన ఆవు మృతి
నాటు బాంబు పేలి తీవ్రంగా గాయపడిన ఆవు నాలుగు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి చివరికి మృత్యువాత పడింది. మనిషి చేసిన తప్పుకు మూగ జీవి బలైంది. చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం కోగిలేరు సమీపంలో జూన్ 28వ తేదీన చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి న వివరాల్లోకి వెళ్తే...
కోగిలేరు సమీపంలో సాకార్డు అనే స్వచ్ఛంద సంస్థ శ్రీకృష్ణ గోమాత పీఠాన్ని నిర్వహిస్తోంది. పీఠానికి చెందిన ఆవు గత శనివారం సాయంత్రం మేత కోసం వెళ్లి పొరపాటున వేటగాళ్లు పెట్టిన నాటు బాంబు కొరికింది. బాంబు పేలుడు దాటికి ఆవు నోటి భాగం ఛిద్రమైంది. అదే రోజు పశు వైద్యాధికారుల సమక్షంలో ఆవుకు చికిత్స చేసి, శస్త్రచికిత్స కోసం తిరుపతి పశు వైద్యశాలకు తీసుకెళ్లారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల శస్త్ర చికిత్స కష్టతరమని అక్కడి అధికారులు తిప్పి పంపేశారు. గత నాలుగు రోజులుగా గాయంతో తీవ్ర నరకయాతన అనుభవించిన ఆవు చివరికి బుధవారం ఉదయం ప్రాణాలు విడిచింది. పెద్దపంజాని మండల పశు వైద్యాధికారులు ఆవుకు పోస్టుమార్టం నిర్వహించి, స్వచ్ఛంద సంస్థ సమీపంలోనే పూడ్చి పెట్టారు. కాగా ఈ ఘటనలో నాటు బాంబు పెట్టిన ముగ్గురు వేటగాళ్లను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.