నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వాతావరణ బీమా విడుదల చేసింది. అయితే నష్ట పరిహారం జాబితా గందరగోళంగా తయారైంది. అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో అర్హులకు రావాల్సిన మొత్తం కంటే తక్కువ వచ్చింది. జాబితాలో కొందరి పేర్లు గల్లంతయ్యాయి.
- కూడేరు మండలం జయపురంలో 477 మంది రైతులు ఉండగా.. 12 మందినే బీమా పథకం జాబితాలో చేర్చారు.
● వజ్రకరూరు మండలం గడేహోతూరులో 600 మంది రైతులు ఉండగా.. 86 మంది పేర్లు మాత్రమే జాబితాలో ఉన్నాయి.
● కదిరి వ్యవసాయ డివిజన్ పరిధి పది మండలాల్లో 2019లో వేరుశనగ నష్టపోయిన 1,12,484 మంది రైతులకు చెందిన 85,497 హెక్టార్లకు రూ.85.49 కోట్ల బీమా సాయం విడుదలైంది. మూడోవంతు మందికి కూడా పరిహారం అందలేదు.
● అన్ని అర్హతలున్న తమకు బీమా వచ్చే చూడాలంటూ పది మండలాల నుంచి 4,343 మంది రైతులు వినతులను సమర్పించారు. ఇందులో కదిరి 174, నల్లచెరువు 550, తనకల్లు 50, గాండ్లపెంట 45, ఎన్పీకుంట 120, తలుపుల 1300, అమడగూరు 400, నల్లమాడ 550, ఓడీచెరువు 430, ముదిగుబ్బలో 724 మంది వ్యవసాయాధికారులకు విన్నవించారు.
● ఆరేడు ఎకరాల్లో పంట సాగుచేసి ఈక్రాపింగ్ చేసినా రూ.700 బీమా పరిహారం రావడం గమనార్హం. మరోవైపు తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు పెద్దమొత్తంలో పరిహారం అందింది. రెండు, మూడు స్థాయిల్లో పంట వివరాలు నమోదు చేస్తున్నా.. తప్పులు దొర్లాయి.
- చాలామంది రైతులు మీసేవ కేంద్రాల్లో బీమా ప్రీమియం చెల్లించారు. కొందరు రెండుసార్లు ప్రీమియం చెల్లించడంతో డూప్లికేట్గా భావించి జాబితాలో పేరు తీసేసినట్లు సమాచారం.
ఈ-పంట.. జాబితా లేదట
ఈ-పంటను ప్రామాణికంగా తీసుకుని పరిహారం మంజూరు చేశారు. అయితే ఇటీవల ఈ-పంట సైట్ను మార్చారు. దాంతో జాబితా కనిపించడం లేదు. నమోదైందో లేదో తెలుసుకోవాలంటే ఆ వివరాలు వ్యవసాయశాఖ వద్ద లేవు. జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి జాబితాను అన్ని మండలాలకు ఆ సమాచారం దిగుమతి (డౌన్లోడ్) కావడంలేదని ఏఓలు చెబుతున్నారు. దీంతో రైతులకు సమాధారం చెప్పలేకపోతున్నామని పలువురు పేర్కొన్నారు. వ్యవసాయ కమిషనరేట్ నుంచి ఈ-పంట జాబితాను తెప్పిస్తున్నామని, రాగానే అన్ని మండలాలకు పంపుతామని జిల్లా అధికారులు తెలిపారు.
హామీ..
దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తోంది. సాగు చేసి, ఈ-పంట నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి ఆదుకుంటాం. - రాష్ట్ర ప్రభుత్వం
●ఆవేదన: జిల్లాలో 9,47,731 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో 4.51 లక్షల మందికి మాత్రమే బీమా పరిహారం మంజూరైంది. 4,96,731 మందికి పరిహారం అందలేదు.