CM Jagan neglect on Two Wheeler Feeder Ambulances : గిరిజనులకు ఊపిరి పోసే ద్విచక్ర వాహన ఫీడర్ అంబులెన్స్లపై జగన్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని రెండేళ్లుగా అత్యవసర వైద్య సిబ్బంది ఎంత మొత్తుకుంటున్నా చెవికెక్కించుకోవడం లేదు. గిరిశిఖర గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనుల ఆరోగ్యం కోసం టీడీపీ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ద్విచక్రవాహనాలతో కూడిన ఫీడర్ అంబులెన్స్ సేవలను 2018లో ప్రారంభించింది. వీటి ద్వారా గర్భిణులు, ప్రాణాంతక వ్యాధుల బారినపడిన రోగులు, ప్రమాదాలకు గురైన వారికి సత్వర వైద్య సేవలు అందేవి. ఈ వాహనంలో పేషెంట్ పడుకునే విధంగా బెడ్ సౌకర్యం, ఆక్సిజన్ సిలిండర్, 12 రకాల వైద్య పరికరాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయి. అప్పట్లో గిరిజనులకు సంజీవనిలా ఉపయోగపడిన ఈ వాహనాలపై వైసీపీ ప్రభుత్వం శీతకన్ను వేసింది.
Two Wheeler Feeder Ambulances Started in AP :గతంలో 108కి ఫోన్ వెళ్లగానే అక్కడి నుంచే ఫీడర్ అంబులెన్స్లకు సమాచారం ఇచ్చి మారుమూల గ్రామాలకు పంపేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక 108 వాహనాల నిర్వహణను అరబిందో సంస్థకు అప్పగించింది. ఫీడర్ అంబులెన్స్ల నిర్వహణ GVK సంస్థ చూస్తోంది. ఈ రెండింటి మధ్య సమన్వయం కొరవడుతోంది. గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది తమకు తెలిసిన ఫీడర్ అంబులెన్స్ పైలట్లకు ఫోన్చేసి చెబితే వారు వచ్చి ఆరోగ్య ఉపకేంద్రం వరకు దించి వెళుతున్నారు. అక్కడి నుంచి 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తున్నారు.
TDP Government Started Feeder Bike Ambulance Services : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 122 వాహనాల్లో దాదాపుగా 100 వరకు వాహనాలకు టైర్లు, క్లచ్ప్లేట్లు అరిగిపోయాయని సమాచారం. కొన్నైతే విరిగిపోయే దుస్థితికి చేరాయి. రోగి పడుకునే బాక్సులు చాలా వాహనాలకు దెబ్బతిన్నాయి. చాలా వాటికి సైరన్ మోగడం ఎప్పుడో ఆగిపోయిందని EMT (Emergency Medical Technician)లు చెబుతున్నారు. వాస్తవానికి ఫీడర్ అంబులెన్స్ల పరిధి 4 కిలోమీటర్లే. ఇప్పుడు 10 నుంచి 20 కిలోమీటర్లూ తిప్పుతున్నారు.