తెలంగాణ .. జంట నగరాల్లో భద్రతపై 'దిశ' హత్యోదంతంతో దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల మంది ఐటీ ఉద్యోగులు రాత్రింబవళ్లు పనిచేస్తున్న నగరంలో ముఖ్యంగా మహిళల రక్షణపై పోలీసుల చర్యలు నీటి మూటలుగా తేలాయి. టోల్గేట్కు కూతవేటు దూరంలో ఘోరం జరిగినా... కనీసం గుర్తించలేకపోవటం ఆర్భాటపు ప్రకటనలను వెక్కిరిస్తున్నాయి. వరుస ఘటనలతో మహిళలు ధైర్యంగా బయటకు వెళ్లాలంటేనే హడలిపోయే దుస్థితి నెలకొంది. రాత్రి 7 దాటిందంటే సిటీలోకి వచ్చే రహదారులన్నీ భయంకరంగా మారుతున్నాయి.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా
బాహ్యవలయ రహదారి హైదరాబాద్ నగరానికే తలమానికం. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వేల వాహనాలు నగరం లోపలికి రాకుండా బయట నుంచే వెళ్లిపోయే విధంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. 158 కిలోమీటర్లు ఉండే ఈ రహదారి ఇప్పుడు అనేక అసాంఘిక, హింసా కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. బాహ్య వలయ రహదారిపై శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకూ మాత్రమే హైవే పెట్రోలింగ్, ట్రాఫిక్ పెట్రోలింగ్, పర్యవేక్షణ, విద్యుత్ దీపాలు ఉన్నాయి. శంషాబాద్ నుంచి విజయవాడ వైపు రహదారి.. దాని పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపై వెళ్లే వాళ్లు ప్రాణాలు అరచేత పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. కటిక చీకటి.. రోడ్డుపై ఏ దోపిడీ దొంగలు ఉంటారోనని సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఆందోళన దిశ ఘటన తర్వాత మరింత ఎక్కువైంది.