Mission South India : ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేరస్థులను తెలుగు రాష్ట్రాల్లో అరెస్టు చేశారు. హరిద్వార్లో 2019 డిసెంబర్లో ఓ గ్రామ సర్పంచ్ను అతికిరాతకంగా హత్య చేసిన వాసిమ్ అనే వ్యక్తి, అతని గ్యాంగ్ అక్కణ్నుంచి పరారై తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తరచూ వారి స్థావరాన్ని మారుస్తూ పోలీసులకు దొరకకుండా జాగ్రత్తపడ్డారు. కానీ వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టుకోవాలని సంకల్పించిన ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్ పోలీసులు మిషన్ సౌత్ ఇండియా పేరుతో ఆపరేషన్ చేపట్టి ఎట్టకేలకు ముగ్గురు నిందితులను విజయవాడ, హైదరాబాద్లలో పట్టుకుని అరెస్టు చేశారు.
Uttarakhand Police Mission South India : ఈ నిందితులను పట్టుకోవడానికి ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్ పోలీసులు చేపట్టిన మిషన్ సౌత్ ఇండియాలో భాగంగా మొదట తెలంగాణకు చేరుకున్నారు. తెలంగాణలో వారు తమ వేషధారణను మార్చుకుని.. తెలుగు వారిలా ఇక్కడి జనంలో ఒకరిగా మారిపోయారు. నెమ్మదిగా తమ మిషన్ని మొదలు పెట్టి ఎట్టకేలకు విజయవంతమయ్యారు. వసీమ్ను పట్టించిన వారికి రూ.50వేల ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు. వసీమ్ను ఏపీలోని విజయవాడలో అరెస్టు చేయగా.. ఇతడి గ్యాంగ్లో మరో ఇద్దరు సల్మాన్, రుబీనాలను హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు వసీమ్ కుటుంబ సభ్యులేనని ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు. సల్మాన్ వసీమ్ సోదరుడు కాగా.. రుబీనా.. వసీమ్ భార్య సోదరి.
Uttarakhand STF Police : భాష తెలియని రాష్ట్రంలో.. వేషధారణ మార్చుకుని నిందితులను పట్టుకోవడానికి ఉత్తరాఖండ్ పోలీసులు చాలా శ్రమపడ్డారు. 15 రోజులు వేషం మార్చుకుని తిరుగుతూ వసీమ్ అండ్ గ్యాంగ్ కోసం వెతికారు. బుర్ఖాలు ధరించి వారి కోసం రెక్కీ నిర్వహించారు. నిందితులు తరచూ లొకేషన్లు మారుస్తూ ఉండటం వల్ల వారిని పట్టుకోవడం పోలీసులకు కత్తి మీద సాముగా మారింది. ముఖ్యంగా తెలుగు భాష తెలియకపోవడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వచ్చింది.