ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Rahul murder case: రాహుల్​ హత్య కేసులో అతనే కీలక సూత్రధారా..? సినీ తరహాలో భారీ స్కెచ్..

నగర నడిబొడ్డున జరిగిన పారిశ్రామికవేత్త రాహుల్‌ హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరంగా సాగుతోంది. రాహుల్ హత్య కేసులో కీలక సూత్రధారి కోగంటి సత్యమేనని పోలీసుల విచారణలో తేలింది. రెండ్రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. హత్య తర్వాత ఎలా పారిపోవాలి, దొరికితే ఎలా వ్యవహరించాలనే విషయాలను సైతం నిందితులంతా ముందుగానే మాట్లాడుకున్నారని పోలీసులు తెలిపారు.

By

Published : Sep 3, 2021, 1:31 PM IST

Rahul murder case
Rahul murder case

రాహుల్​ హత్య కేసు

రాష్ట్రంలో సంచలనం రేపిన జిక్సిన్‌ సిలిండర్ల కంపెనీ ఎండీ రాహుల్ హత్య కేసు (rahul murder case) దర్యాప్తును ఓ కొలిక్కి తెస్తున్నారు విజయవాడ పోలీసులు. నిందితుడు కోగంటి సత్యంను.. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. విచారణలో కోగంటి నివ్వెరపోయే నిజాలను బయటపెట్టారు. తన కుమార్తె వైద్య సీటు కోసం గాయత్రి.. రాహుల్‌కు 6 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఆ మొత్తాన్ని రాహుల్‌ తిరిగి ఇవ్వనందుకు.. అతన్ని హత్య చేయించాలని పథకం పన్నింది. ఆమేరకు కోగంటి, కోరాడతో కలిసి హత్యకు వ్యూహరచన చేసింది. నిందితులంతా కొత్త సెల్ ఫోన్‌లు ,సిమ్ కార్డులు తీసుకొని.. వాటి ద్వారానే హత్యకు సంబంధించిన విషయాలను మాట్లాడుకున్నారని విచారణలో పోలీసులు గుర్తించారు. రాహుల్‌ను ఎలా ఇంటి నుంచి బయటకు రప్పించాలి.. ఎక్కడ హత్య చేయాలనే విషయాలపై ముందే పథక రచన చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాహుల్​ను మొదట కోరాడ ఫైనాన్స్​కు పిలిపించి.. అక్కడ అతనిపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తర్వాత గాంధీనగర్ లోని దుర్గా కళామందిర్‌కు తీసుకెళ్లి.. అక్కడ కోగంటి సత్యం సమక్షంలో మరోసారి దాడి చేశారు. తనకు ఇవ్వాల్సిన 6 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో.. కంపెనీలో రాహుల్‌కు సంబంధించిన కొంత వాటాను గాయత్రి …తన కుమార్తె ,అల్లుడు పేర్లపైకి మార్పించుకొంది. కొంత వాటాను కోరాడ విజయ్ కుమార్.. తన పేరు మీద రాయించుకున్నారు. ఆ తర్వాత పథకం ప్రకారం రాహుల్‌ను కారులో తీసుకెళ్లి.. హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో కోరాడ ఫైనాన్స్, దుర్గా కళామందిర్, సంఘటనా స్థలం, సత్యందొడ్డి ప్రాంతాలు కీలకం. ఒక చోటకు వచ్చిన నిందితులు మరోచోటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. నాలుగు ప్రాంతాల్లో ఎవరెవరు ఉండాలి? ఏపని చేయాలి ? అనే విషయాలు నిందితులు ఫోన్లలోనే మాట్లాడుకున్నారని విచారణలో బయటపడింది.

హత్య ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు నిందితులు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాహుల్‌ను హత్య చేసిన కేబుల్‌ను.. ఆయన సెల్ ఫోన్‌ను పారేసినట్లు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నా కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు వారంతా తప్పుడు సమాచారం ఇచ్చారని స్పష్టం చేశారు. అయితే కారులో నమోదైన సాంకేతిక ఆధారాలు పోలీసులకు దర్యాప్తులో ఉపయోగపడ్డాయి. వీటి ఆధారంగానే హత్య సమయాన్ని గుర్తించారు. ఆమేరకు ఆయా మార్గాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను సేకరించారు.

ఇదీ చదవండి:

RAHUL MURDER CASE : రాహుల్ హత్య కేసు... కీలక నిందితుల కోసం గాలింపు

RAHUL MURDER CASE: 'వ్యాపార లావాదేవీల్లో వివాదాలే రాహుల్ హత్యకు కారణం'

ABOUT THE AUTHOR

...view details