రాజధానిపై తుది నిర్ణయం కేబినెట్దే : విజయసాయిరెడ్డి రాజధాని విషయంలో నిపుణుల కమిటీ ఇచ్చే సిఫార్సులను మంత్రిమండలి సమావేశంలో చర్చించి సీఎం నిర్ణయం తీసుకుంటారని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఒక దగ్గరే అభివృద్ధి కేంద్రీకృతం చేయడం వైకాపా అభిమతం కాదని ఆయన తేల్చి చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ప్రత్యేక హోదా ఎప్పుడూ తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశమేనని, కేంద్రానికి ఎప్పుడు విజ్ఞప్తి చేసినా తొలి అంశంగా ప్రత్యేక హోదానే ఉంటుందన్నారు.
కొత్త సిట్ పరిధి విస్తరణ
విశాఖ భూముల వ్యవహారంలో గత సిట్ ఇచ్చిన నివేదిక అసమగ్రంగా ఉందన్నారు. ఆ నివేదిక తెదేపా మంత్రులు, ప్రజాప్రతినిధులను రక్షించే విధంగా ఉందన్నారు. ఈ లోపాలను సరిచేసేందుకే మరో సిట్ వేసి, దాని పరిధిని విస్తరించి, సిట్కు సుమోటోగా విచారించే అధికారం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు. పవన్ చంద్రబాబుకి అమ్ముడుపోయాడా లేదా అన్నది ఆయనకే తెలుసునని విమర్శించారు.
తప్పు మార్గంలోభాజపా రాష్ట్ర నాయకత్వం
పవన్ చంద్రబాబుకి దత్తపుత్రుడన్న విజయసాయిరెడ్డి... ఒక సినిమా హీరోలా మాట్లాడితే ఎవరు పట్టించుకుంటారని విమర్శించారు. ప్రభుత్వం చేసే ఏ పని అయినా విమర్శించే హక్కు ప్రతిపక్షానికి, పత్రికలకు ఉందన్న ఆయన..ఆ విమర్శలు సహేతుకంగా ఉండాలన్నారు. భాజపా రాష్ట్ర నాయకత్వం తప్పు మార్గంలో పయనిస్తోందని...కేంద్ర నాయకత్వంపై తమకు ఎటువంటి వ్యతిరేకత లేదన్నారు. కేటాయించిన అవసరానికి భూమిని వినియోగించకపోయినా, బోగస్ కంపెనీలకు కట్టబెట్టినా అటువంటి భూకేటాయింపులన్నీ రద్దు చేస్తామన్నారు.