రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఛైర్మన్ జీ. సతీశ్రెడ్డి గురువారం రాత్రి విశాఖ వచ్చారు. నావికా సమరశాస్త్ర సాంకేతిక ప్రయోగశాల (ఎన్.ఎస్.టీ.ఎల్.) సంచాలకులు నందగోపన్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. శుక్రవారం ఆయన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖలోని ఎన్.ఎస్.టీ.ఎల్. ప్రయోగాలకు, డీఆర్డీవో బంగాళాఖాతం కేంద్రంగా నిర్వహించే ప్రయోగాల సమీక్షకు ఆయన గతంలో పలుసార్లు విశాఖ వచ్చారు.
ఈ తరుణంలో ఆయన రాక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల నుంచి క్షిపణులను ప్రయోగించి వాటి పనితీరును తెలుసుకునే కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బంగాళాఖాతం కేంద్రంగానూ క్షిపణి ప్రయోగం జరిగింది. ఈ క్రమంలో విశాఖ కేంద్రంగా గానీ, సమీప ప్రాంతాల నుంచి గానీ క్షిపణి ప్రయోగాలు నిర్వహించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే అధికారులు ఆ విషయాన్ని ధ్రువీకరించడంలేదు.