విశాఖలోని గీతం విశ్వవిద్యాలయం కట్టడాల విషయంలో సోమవారం వరకు తదుపరి కూల్చివేతలు చేపట్టొద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఆదివారం పూర్తి స్థాయి విచారణ చేపడతామని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
తమకు చెందిన కట్టడాలను అధికారులు హడావుడిగా కూల్చివేస్తున్నారని పేర్కొంటూ గీతం యాజమాన్యం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది . ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి విచారణ జరిపారు . పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉందన్నారు. నోటీసు ఇవ్వకుండా హడావుడిగా కూల్చివేత ప్రక్రియ చేపట్టారన్నారు. రెవెన్యూశాఖ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి విచారణలో పాల్గొన్నారు.