తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సీఎల్పీ, పీసీసీ రెండు కళ్లలాంటివని రేవంత్రెడ్డి అన్నారు. పీసీసీగా ఎంపికైన నాటి నుంచి పార్టీ సీనియర్లను, కీలక నేతలను కలుసుకుంటున్న రేవంత్ రెడ్డి... ఈరోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. కొన్ని రోజులుగా కలిసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించగా... భట్టి నిరాకరిస్తూ వచ్చారు. ఈరోజు ఉదయం పీసీసీ సీనియర్ ఉధ్యక్షుడు మల్లు రవితో చర్చల అనంతరం.. భట్టిని రేవంత్ కలిసి.. రేపటి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.
జోడెద్దుల్లా పనిచేస్తాం...
"ఇద్దరం జోడెద్దుల్లా పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నేరవేర్చేందుకు కృషి చేస్తాం. రెండు తరాలుగా పార్టీకి సేవలందిస్తోన్న మల్లు కుటుంబం... కాంగ్రెస్కు పర్యాయపదంగా మారింది. పార్టీ పెద్దల అనుభవాలను స్వీకరిస్తూ.. ఇద్దరం సమన్వయంతో ముందుకెళ్తాం. ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కిన కేసీఆర్ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించే దిశగా పనిచేస్తాం. తెలంగాణ ప్రజలకు గౌరవం, స్వేచ్ఛ లేకుండా చేస్తోన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు అన్నివిధాల కృషి చేస్తాం. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడతాం."
-రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
కలిసికట్టుగా కృషి చేయాలి...
"తెలంగాణ ఉద్యమ లక్ష్య సాధనకు అందరూ కలిసిగట్టుగా కృషిచేయాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను చేరుకునేందుకు... కిందిస్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నేతల వరకు అందరిని రేవంత్ రెడ్డి కలుపుకొని ముందుకు సాగాలి. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి విజయవంతం కావాలి. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలివచ్చి రేవంత్కు మద్దతు తెలపాలి."