2019తో పోల్చితే 2020లో 12 శాతం కేసుల సంఖ్య తగ్గిందని విజయవాడ నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు స్పష్టం చేశారు. కొవిడ్ లాక్డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై మొత్తం 3,568 కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. 78.77శాతం కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేసినట్లు ఆయన వెల్లడించారు. గతంతో పోలిస్తే...సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూ వస్తోందన్నారు. మహిళలపై నేరాల సంఖ్య గతేడాదితో పోల్చితే 11.19 శాతం తగ్గాయన్నారు. ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసుల విచారణ, కోర్ట్ మానిటరింగ్ సెల్ ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేస్తున్నామన్నారు. 55 శాతం కేసుల్లో నేరస్తులకు శిక్ష పడిందన్నారు. 2020లో మొత్తం 15,382 కేసులు నమోదయ్యాయని సీపీ వివరించారు.
రోడ్డు ప్రమాదాలు తగ్గాయ్..
రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని.., అందుకు లాక్డౌన్ కూడా కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. మోటారు వాహన చట్టం ప్రకారం మొత్తం 6,94,891 కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం 75 గంజాయి కేసులు నమోదు చేసి 166 మందిని అరెస్టు చేశామని.. అందులో 1కోటి 60లక్షల 95వేల 200 రూపాయల విలువైన 4,135.57 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటుపడిన యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు, డీ-అడిక్షన్ సెంటర్లలో చికిత్స అందించేలా చర్యల చేపట్టామన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.
కమ్యూనిటీ పోలీసింగ్కు ప్రాధాన్యత..
1,231 లిక్కర్ కేసులు నమోదు చేసి 1,02,957 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. నిరంతర నిఘాతో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డయల్ 100కి ఫోన్ వచ్చిన తర్వాత గరిష్టంగా 6 నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 79 రౌడీషీట్లు తెరిచామని..,పటమట గ్యాంగ్వార్ కేసుల్లో 61 మందిని అరెస్టు చేసి, 25 మందిపై రౌడీ, సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసినట్లు వెల్లడించారు. కమ్యూనిటీ పోలీసింగ్కు ప్రాధాన్యతనిస్తున్నామని...మహిళా మిత్రల సహకారంతో సత్ఫాలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు. సైబర్ మిత్రను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాల్సివుందని అభిప్రాయపడ్డారు.