మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 430 చదరపు గజాల్లోని ఇళ్లకు సంబంధించి లబ్దిదారుల వాటా రూ.25 వేలకు మాత్రమే పరిమితం చేస్తున్నామని పేర్కొన్నారు. డిసెంబరు 2022 కల్లా 2.62 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ముందుగా తాగునీరు, సీవరెజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు, మురుగునీరు సదుపాయాలు కల్పించిన తర్వాత లబ్దిదారులకు ఇళ్లను అందిస్తామని తెలిపారు. అప్లోడ్ చేసిన బిల్లులను ప్రతీ నెలా చెల్లింపులు పూర్తి చేస్తామని సురేశ్ వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పూర్తైన ఇళ్లను వచ్చే నెలలో లబ్దిదారులకు అందిస్తామని చెప్పారు. తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్ల వద్ద శాశ్వత ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు లేవని మంత్రి విమర్శించారు. దశలవారీగా ఒక్కో ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.