కొవిడ్ సమయంలో అత్యవసర సేవలందించేందుకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్న 26,325 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్కి 6 నెలలుగా జీతాల్లేక తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి తక్షణమే బకాయిలు విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. కొవిడ్ వ్యాప్తి తొలిదశ సమయంలోనే వ్యాప్తి నియంత్రణ కోసం ఫ్రంట్ లైన్ వారియర్లుగా వేలాది మందిని ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా తీసుకున్నారని పేర్కొన్నారు. కొవిడ్ వచ్చిన వారిని సొంత కుటుంబసభ్యులే దూరం పెట్టిన పరిస్థితుల్లో, ప్రాణాలకు తెగించి కొవిడ్ బాధితులకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన ఫ్రంట్లైన్ వారియర్స్ని పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. సెలవుల్లేవు, పండగలు-పబ్బాలైనా విధుల్లో వున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని లోకేశ్ ఆరోపించారు.
ప్రజల ప్రాణాలు కాపాడటానికి వేలకోట్ల అప్పులు చేయాల్సి వచ్చిందని పదేపదే చెబుతోన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి 26,325 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్కి 6 నెలలుగా జీతాలివ్వలేదని, చేసిన అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొవిడ్ మహమ్మారి సమయంలో సేవలు అందించేవారికి.. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలలో కొన్ని గ్రేస్ మార్కులు ఇస్తామని ఆశపెట్టడంతో చాలా మంది ఇప్పుడు ప్రాణాలకు తెగించి కష్టపడితే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు పొందొచ్చని కొందరు, తమని రెగ్యులర్ చేస్తారనే ఆశతో మరికొందరు ..జీతాలు ఇవ్వకపోయినా పనిచేస్తూనే వున్నారని పేర్కొన్నారు.