ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Auto Nagar Lands: ఆటోనగర్‌లపై ఇంపాక్ట్‌ ఫీజు.. పలు ప్రాంతాల్లో నోటీసులు

రాష్ట్రంలోని ఆటోనగర్​ భూములపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిశ్రమల కోసం భూములు తీసుకుని.. అనుమతి లేకుండా ఇతర అవసరాల కోసం వాడుకుంటున్న వారి నుంచి ఇంపాక్ట్​ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. భూమి విలువలో 50 శాతం వరకు ఈ ఫీజు ఉండనుంది. ఇందుకోసం ఇప్పటికే పలువురికి ఏపీఐఐసీ నోటీసులిచ్చింది.

By

Published : Mar 10, 2022, 7:29 AM IST

autonagar lands
autonagar lands

Autonagar Lands: రాష్ట్రంలోని ఆటోనగర్‌లలో పరిశ్రమల కోసం కేటాయించిన భూముల వినియోగ తీరును మార్చుకున్న వారి నుంచి ఇంపాక్ట్‌ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతుల్లేకుండా భూములను పారిశ్రామికేతర అవసరాలకు వినియోగిస్తున్న వారి నుంచి దీన్ని వసూలు చేయనుంది. భూముల విలువలో 50% ఇంపాక్ట్‌ ఫీజుగా నిర్దేశించింది. లేదంటే మొత్తం విస్తీర్ణంలో 50% భూమిని ప్రభుత్వానికి అప్పగించాలి. రాష్ట్రంలోని అన్ని ఆటోనగర్‌లలో ఇలాంటి వాటిని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) గుర్తించి నోటీసులిస్తోంది. ఇంపాక్ట్‌ ఫీజు కింద సుమారు రూ.3వేల కోట్ల వరకూ రావొచ్చని అంచనా. ఆటోనగర్‌లలోని భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించుకోడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికి అనుమతులివ్వడానికి కో-ఆర్డినేటెడ్‌ గ్రోత్‌ పాలసీని (సీజీపీ) ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు అనధికారికంగా వినియోగిస్తున్న వారికి సీజీపీ కింద జీవో5 కచ్చితంగా వర్తిస్తుందని అంటున్నారు.

విజయవాడ నుంచే రూ.421 కోట్లు

  • విజయవాడలోని జవహర్‌ ఆటోనగర్‌లో ఏపీఐఐసీ నిర్దేశించిన ధర ప్రకారం చదరపు గజం రూ.25,741.09 ఉంటే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ లెక్క రూ.25,900 వరకు ఉంది.
  • కానూరు ఆటోనగర్‌లో ఏపీఐఐసీ నిర్దేశించిన ధర గజం రూ.8,395.02 ఉంటే.. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం లెక్క రూ.13,500 వరకు ఉంది.
  • జవహర్‌ ఆటోనగర్‌లో 212 యూనిట్లు, కానూరులో 40 యూనిట్లకు కలిపి కేటాయించిన 29 ఎకరాలను హోటళ్లు, లాడ్జిలు, పెట్రోలు బంకుల్లాంటి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు తేల్చారు. వారికి సీజీపీ కింద ఇంపాక్ట్‌ ఫీజు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో బహిరంగ మార్కెట్‌ విలువ గజం రూ.60వేల వరకు ఉంది. ఈ లెక్కన ప్రభుత్వానికి వచ్చే 14.5 ఎకరాల విలువ సుమారు రూ.421 కోట్లు అవుతుంది.
  • విశాఖపట్నంలోని గాజువాక ఆటోనగర్‌లో మొత్తం 1,143 యూనిట్లలో 257 యూనిట్లకు కేటాయించిన స్థలాలను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాటి వివరాలు సేకరిస్తున్నారు. నెల్లూరులోనూ ఇప్పటికే యూనిట్లను గుర్తించి, వాటికి నోటీసులు జారీచేశారు.

భూములు అప్పగించినా విలువ పెరుగుతుందట

సీజీపీ కింద ప్రభుత్వం జీవో 5, 6 కింద రెండు ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 5 ప్రకారం ప్రతి అసెస్‌మెంట్‌ (పరిశ్రమ) విస్తీర్ణంలో 50% స్థలాన్ని ప్రభుత్వానికి ఇవ్వడంవల్ల భూములు ముక్కలుగా వస్తాయి. అలా కాకుండా ఒక బృందంగా ఏర్పాటై.. ఒకే బ్లాక్‌గా భూములు అప్పగించినా తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అలా ఇస్తే మిగిలిన భూమికీ విలువ పెరుగుతుందని ఆటోనగర్‌ నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో అధికారులు చెబుతున్నారు. భూముల వినియోగాన్ని మార్చుకోవడానికి సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తామని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

Amaravathi News: కొత్త రాజధానిలో సంస్థల ఏర్పాటు బాధ్యత కేంద్రానిది కాదా?

ABOUT THE AUTHOR

...view details