No berth to Balineni: మంత్రివర్గంలోని అందరూ రాజీనామాలు చేశారు. సామాజిక కారణాల దృష్ట్యా ఒకరో ఇద్దరో మళ్లీ కొనసాగుతారని సీఎం చెప్పడంతో అంతా సర్దుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అలాగే అనుకున్నారు. కానీ, ఇప్పుడు పాత మంత్రుల్లో 11 మంది మళ్లీ కొత్త కేబినెట్లో స్థానం పొందగలిగారు. బాలినేనికి మాత్రం రిక్తహస్తం మిగిలింది. ఒంగోలు జిల్లాలో తనను పక్కనపెట్టి, తనతోపాటు మంత్రిగా చేసిన మరొకరిని ఇప్పుడు కొనసాగించడం ఆయనకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. తొలగిస్తే ఇద్దరినీ తొలగించండి, లేదా ఇద్దరినీ కొనసాగించండి అని ఆయన ఇప్పటికే రెండు మూడు దఫాలుగా ముఖ్యమంత్రి ముందే తన అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం.
కానీ చివరికి అసమ్మతితో మిగిలిపోయారు. మంత్రి పదవులు దక్కని ఆశావహుల అసమ్మతికీ ఆద్యుడయ్యారు. మంత్రి పదవి ఆశించి భంగపడిన సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి కూడా బాలినేనిని కలిసినట్లు తెలిసింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, కొండెపి వైకాపా బాధ్యుడు వెంకయ్య సైతం శ్రీనివాసరెడ్డిని పరామర్శించినట్లు సమాచారం.
నన్నింత అవమానిస్తారా?:‘నన్నింత అవమానిస్తారా? అందరినీ తీసేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు ఇలా మోసం చేస్తారా? నేను పార్టీ కోసం పనిచేయలేదా? జిల్లాలో పార్టీకి అన్నీ నేనై చూసుకోవడం లేదా? వ్యయ ప్రయాసల కోర్చి పనిచేయడం లేదా?’అని బాలినేని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సజ్జల, శ్రీకాంత్ బుజ్జగించడంలో భాగంగా.. ‘మీరు సీనియర్, సీఎం బంధువు కూడా. సర్దుకుపోతే బాగుంటుంది. మీరు అసమ్మతితో ఉంటే ఇతరులపైనా దీని ప్రభావం పడుతుంది కదా?’అని చెప్పినట్లు తెలిసింది. దీనికి బాలినేని స్పందిస్తూ.. ‘కేబినెట్లో మిగిలిన ముగ్గురు(తన సామాజికవర్గం) మంత్రుల్లో ఇద్దరిని మళ్లీ తీసుకున్నారంటే అర్థం ఏంటి? అంటే నేను అసమర్థుడిననా? కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా నాలుగేళ్ల పదవీకాలాన్ని వదులుకుని వచ్చి మరీ పార్టీ(వైకాపా) కోసం నిలబడలేదా?’అని తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ‘మూడు నాలుగు జిల్లాల్లో పార్టీని లీడ్ చేసేలా మీకు ప్రాంతీయ స్థాయి సమన్వయకర్తగా పెద్ద హోదాను ఇవ్వనున్నారు కదా?’అని సజ్జల బాలినేనికి చెప్పినట్లు తెలిసింది. ఇలా గంటపాటు చర్చలు జరిగినా బాలినేని మెత్తబడలేదని సమాచారం. సోమవారం కూడా ఆయనతో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది.
షర్మిలతో బాలినేని సమావేశం..!తీవ్ర అసహనంతో ఉన్న బాలినేని సోమవారం మరి కొద్దిమంది ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిలతో భేటీ అవనున్నారని.. ఆదివారం రాత్రి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది.