ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఒక్కరూ కంటి సమస్యల(eye problems)కు వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఇక్కడే అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక నేత్ర వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్(LV prasad eye institute) యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి జగన్(cm jagan) కోరారు. అంధత్వ నివారణకు అవసరమైన పరీక్షల నుంచి శస్త్రచికిత్సల వరకు అన్ని స్థాయిల్లోనూ ఆధునిక వైద్యం అందుబాటులోకి తేవాలని ఆయన విజ్ఞప్తి చేయగా, ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది.
రాష్ట్రంలోని అన్ని అనాథ శరణాలయాల్లోని చిన్నారులకు నేత్ర వైద్య పరీక్షలు, చికిత్సలు ఉచితంగా చేస్తామని ప్రకటించింది. ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్.రావు, వ్యవస్థాపక సభ్యురాలు జి.ప్రతిభారావు, ఆ సంస్థ ఛైర్మన్ ప్రశాంత్గార్గ్, వైస్ఛైర్మన్ రాజీవ్రెడ్డి తదితరులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కడపలో టెర్షరీ ఐకేర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో సమగ్ర కంటి పరీక్షలు, చికిత్సలకు సంబంధించి సలహాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు.. దానిపై సీఎంతో ప్రాథమికంగా చర్చించారు.