పంచాయతీ ఎన్నికలకు తెదేపా మేనిఫెస్టోను విడుదల చేయటంపై వైకాపా అభ్యంతరం తెలిపింది. రాజ్యాంగ స్ఫూర్తిని పక్కన పెట్టి మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై సుమోటోగా తీసుకుని చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల రహితంగా జరుగుతాయని.. ఎన్నికలకు చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేయటం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమన్నారు. చంద్రబాబుపై ఎస్ఈసీ ఏ చర్య తీసుకుంటారో సమాధానం చెప్పాలన్నారు.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎస్ఈసీ పదేపదే మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తితో కాకుండా చంద్రబాబు స్ఫూర్తితో ఎస్ఈసీ పనిచేస్తున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్లో ఎన్నికల జాబితా నుంచి విత్ డ్రా కాకుండా దుగ్గిరాలలో ఎస్ఈసీ ఓటుకు దరఖాస్తు చేశారన్నారు. ఓటు ఇవ్వలేదని అధికారులపై కక్ష తీర్చుకోవాలనే భావన ఎస్ఈసీలో కనిపిస్తోందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆన్లైన్లో నామినేషన్లు దాఖలకు రూల్స్ అంగీకరించవన్న అంబటి... దీన్ని చేపట్టాలంటే అన్ని పార్టీలతో చర్చ జరిపాకే ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాలన్నారు.