ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేడు కల్పవృక్ష వాహనంపై స్వామివారు.. రేపు గరుడవాహన సేవ

By

Published : Sep 22, 2020, 4:32 AM IST

తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా సాగుతున్నాయి. ఉత్సవాల మూడోరోజున ఉదయం సింహవాహనంపై దర్శనమిచ్చిన మలయప్పస్వామి... రాత్రి కాళీయమర్థనుడి అవతారంలో ముత్యపుపందిరిపై కటాక్షించారు. ఇవాళ ఉదయం కల్పవృక్ష, రాత్రి సర్వభూపాల వాహన సేవలను నిర్వహించనున్నారు. విశిష్టమైన గరుడసేవను బుధవారం రాత్రి సీఎం జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం నిర్వహించనున్నారు.

tirumala-brahmotsavalu-2020-4th-day
tirumala-brahmotsavalu-2020-4th-day

బ్రహ్మోత్సవాల మూడో రోజు ఉదయం సింహవాహనంపై యోగనరసింహుడి అవతారంలో స్వామివారు దర్శనమిచ్చారు. రాత్రి అమ్మవార్లతో కలసి కాళీయమర్థన చిన్నికృష్ణుడి అవతారంలో కటాక్షించారు. శ్రీవారి సన్నిధి నుంచి విమాన ప్రదక్షిణగా క‌ల్యాణ మండ‌పానికి స్వామివారు రాగా ... అక్కడ కొలువుదీర్చిన వాహన సేవలపై విశేష తిరువాభరణాలు, పరిమళభరిత పూలమాలలతో అలంకృతులయ్యారు. మంగళవాయిద్యాలు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల్లో విశేషంగా నిర్వహించే స్నపనతిరుమంజనాన్ని జీయంగార్ల సమక్షంలో అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ రంగ‌నాయ‌కుల మండ‌పంలో ప్రత్యేక వేదిక‌పై ఆశీనులైన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారి ఉత్సవ‌మూర్తుల‌కు కంక‌ణ‌భ‌ట్టార్ గోవిందాచార్యులు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని చేశారు. పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు ప‌లు ర‌కాల సుగంధ ద్రవ్యాల‌తో అభిషేకం చేశారు.

ఉత్సవాల్లో ప్రధాన వాహనసేవైన గరుడ సేవను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ గరుడ సేవరోజున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. 24 వ తేదీ ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రితో కలసి జగన్‌.... సుందరకాండపారాయణంలో పాల్గొంటారు. తిరుమలలోని కర్ణాటకాసత్రం వద్ద వసతిసముదాయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రులు పర్యటించే ప్రాంతాలను తితిదే ఉన్నతాధికారులు సందర్శించి భద్రతా ఏర్పాట్లను ప‌రిశీలించారు.

నేడు కల్పవృక్ష వాహనంపై స్వామివారు..

ఇదీ చదవండి:ఇవాళ దిల్లీకి సీఎం జగన్..ప్రధానితో భేటీ!

ABOUT THE AUTHOR

...view details