జాబుల్లేని జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి కొత్తది విడుదల చేయాలన్న డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. విజయవాడలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. భాజపా అనుబంధ విద్యార్థి సంఘాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కొత్త క్యాలెండర్పై నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి సుబ్బారావు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్ పాల్గొన్నారు.
ఈ నెల 18 న జగన్ సర్కార్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తూ నూతన జాబ్ క్యాలెండరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1,2 లకు సంబంధించిన 36 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమని వాపోయారు. ఆయా శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం తోపాటు మెగా డీఎస్సీ, పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం రీనోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.
అనంతపురంలో నిరుద్యోగ వేదిక ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ మోసం చేసేలా ఉందని మండిపడ్డారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన నిరుద్యోగ వేదిక నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించి, అక్కడి నుంచి తరలించారు. పోలీసులతో ఉద్యమాల్ని అణిచివేయడం అసాధ్యమన్న నిరుద్యోగులు.... ప్రభుత్వం దిగిరాకుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.