ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా... సినిమా హాళ్లు తెరవడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఇప్పటికిప్పుడు సినిమా ప్రదర్శనలు ప్రారంభించేందుకు థియేటర్ల యజమానులు సిద్ధంగా లేరు. విడుదలకు సిద్ధంగా తగినన్ని సినిమాలు లేకపోవడంతో పాటు, కరోనా వల్ల సగం సీట్లలో మాత్రమే ప్రేక్షకులను అనుమతించాలన్న నిబంధన అమల్లో ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన టికెట్ ధరలపై థియేటర్ల యజమానులు అసంతృప్తిగా ఉండటం దీనికి కారణాలు. ముఖ్యంగా పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని థియేటర్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సినిమాలు ప్రదర్శించడం తమకు సాధ్యం కాదని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. పరిస్థితులన్నీ సద్దుమణిగి థియేటర్లు తెరవడానికి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని, వినాయక చవితి తర్వాతే ప్రదర్శనలు ప్రారంభం కావచ్చని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.
‘ఓవర్సీస్’ కూడా చూసుకుని..!
కరోనా దెబ్బకు 2020 మార్చి 23న థియేటర్లు మూతపడ్డాయి. మొదటిదశ ఉద్ధృతి తగ్గి... లాక్డౌన్ పూర్తిగా ఎత్తేశాక, సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా విడుదలకు సినిమాలు సిద్ధంగా లేకపోవడంతో థియేటర్లు తెరుచుకోలేదు. 10-15 శాతం థియేటర్లు డిసెంబరులోను, మిగతావాటిని 2021 జనవరి 10న తెరిచారు. రెండోదశ ఉద్ధృతితో మళ్లీ ఏప్రిల్ 23 నుంచి థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం ‘విరాటపర్వం’, ‘లవ్స్టోరీ’ వంటి కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నా, వాటి నిర్మాతలు అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో అన్ని షోలకూ ప్రభుత్వం అనుమతిచ్చింది.