తాము నామినేషన్లు వేసేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వస్తే కొందరు అడ్డుకుని బెదిరింపులకు గురిచేసినట్లు పలువురు స్థానిక సంస్థల అభ్యర్థులు జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ప్రత్యర్థుల బెదిరింపులు, దౌర్జన్యాల కారణంగా నామినేషన్లు వేయలేని వారు, వేసినా వెనక్కి తీసుకున్న వారు తగిన ఆధారాలతో వస్తే మరో అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనకు పదుల సంఖ్యలో బాధితులు స్పందించారు.
కలెక్టర్లకు మొర..
ప్రత్యర్థుల ఆగడాల కారణంగా ఎన్నికల్లో ఎలా అవకాశం కోల్పోయారో వివరిస్తూ కలెక్టర్లకు మొరపెట్టుకున్నారు. ముఖ్యంగా తొలిరోజు శుక్రవారం చిత్తూరులో 18, విశాఖలో 19, కడపలో 14, పశ్చిమ గోదావరిలో 27 మంది చొప్పున ఫిర్యాదు చేశారు. ఇందులో సింహభాగం ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులే ఉన్నారు. కొందరు అభ్యర్థులు తాము ఎదుర్కొన్న బెదిరింపుల తాలూకు వీడియో ఫుటేజీలు, ఆడియో క్లిప్పులు, ఫొటోలను జత చేసి మరీ అధికారులకు అందజేశారు.
ఫిర్యాదుల స్వీకరణకు నేడే తుది గడువు
ఎస్ఈసీ ప్రకటించిన ప్రకారం ఫిర్యాదుల స్వీకరణకు శనివారం వరకు గడువు ఉంది. చిత్తూరు జిల్లాలో తొలిరోజే శుక్రవారం 18 ఫిర్యాదులు వచ్చాయి. జడ్పీటీసీ స్థానానికి నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులు బెదిరించారని గంగాధర నెల్లూరు, నాగలాపురం, కార్వేటినగరానికి చెందిన అభ్యర్థులు పేర్కొన్నారు. పంచాయతీకి ఎలాంటి బకాయిలు లేవని నిర్ధారించే ధ్రువపత్రం జారీ చేయడానికి అధికారులు మొదట ఇబ్బంది పెట్టారని కార్వేటినగరానికి చెందిన ఝాన్సీ వాపోయారు. ధ్రువపత్రం ఇచ్చాక నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని వివరించారు. ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేయనివ్వలేదని, వేసిన వారిని ప్రత్యర్థులు బెదిరించి ఉపసంహరించుకునేలా చేశారని ఇదే జిల్లాకు చెందిన మరో 15 మంది ఫిర్యాదు చేశారు.
అధికారుల తీరుపై కాకినాడలో నిరసన
తమ ఫిర్యాదులపై అధికారులు సరిగా స్పందించలేదని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, శంఖవరం, రౌతులపూడి, పిఠాపురం మండలాలకు చెందిన పలువురు జడ్పీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా పరిషత్ కార్యాలయానికి వచ్చిన వీరు.. తమను ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ వేయకుండా ప్రత్యర్థులు అడ్డుకున్నారని, మరో అవకాశం కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. తగిన ఆధారాలు చూపించాలని అధికారులు అడగ్గా.. ముందు తమ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. నామినేషన్ వేయకుండా ప్రత్యర్థులు తనను నిర్బంధించారని పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పి.బుల్లిబాబ్జి వివరించారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడం వల్ల వారంతా కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.