ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 9, 2021, 7:27 AM IST

ETV Bharat / city

న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లతో మసకబార్చే యత్నం: జస్టిస్ కె. లలిత

తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వెళుతున్న న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితకు ఏపీ హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర నేతృత్వంలో న్యాయమూర్తులు అందరూ మొదటి కోర్టు హాలులో సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో  జస్టిస్‌ లలిత అందించిన న్యాయసేవలను హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర కొనియాడారు.

జస్టిస్ కె. లలిత
జస్టిస్ కె. లలిత

తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వెళుతున్న న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితకు ఏపీ హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర నేతృత్వంలో న్యాయమూర్తులు అందరూ మొదటి కోర్టు హాలులో సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ లలిత అందించిన న్యాయసేవలను హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర కొనియాడారు. ఎలాంటి భయాందోళన, పక్షపాతం చూపకుండా కేసులను విచారించారన్నారు.

ఆమె ఎలాంటి సంకోచం లేకుండా ఉత్తర్వులు జారీ చేస్తారన్నారు. పలు వ్యాజ్యాల్లో కీలక ఉత్తర్వులిచ్చారని తెలిపారు. 12వేలకుపైగా కేసులను విచారించారని.. మొత్తం 4,325 కేసులు పరిష్కరించారన్నారు. జస్టిస్‌ లలిత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ లలిత మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ, వారిని భయపెట్టే ప్రయత్నం జరగుతోందని పేర్కొన్నారు. న్యాయమూర్తులను తీవ్ర ఒత్తిడి వాతావరణంలో పనిచేసే పరిస్థితులు కల్పిస్తున్నారన్నారు. కదిలే మేఘాలు నీడను ప్రసరింప చేయడం ద్వారా వెలుగును అడ్డుకున్నట్లే.. కొందరు న్యాయవ్యవస్థ ప్రకాశాన్ని మసకబారేలా యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆశావాదిగా అలాంటి ఘటనలను కదిలే మేఘాలుగా భావిస్తానని చెప్పారు. బెదిరింపులకు తలవంచకుండా న్యాయవ్యవస్థ తన హుందాతనాన్ని కాపాడుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు న్యాయ వ్యవస్థ ఆశాకిరణం అన్నారు. సాధారణ వ్యక్తుల హింసకంటే చట్టబద్ధమైన వ్యక్తి నిశ్శబ్దం ప్రమాదకరమన్నారు. ఎవరికీ భయపడకుండా, నిజాయితీగా విధులు నిర్వర్తించినందుకు సంతృప్తిగా ఉందన్నారు. ఏడాదిన్నర కాలంలో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులు, మరో ఏడుగురు న్యాయమూర్తులతో కలిసి కేసులు విచారించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

వాదనల సందర్భంగా కొంతమంది న్యాయవాదులు.. న్యాయమూర్తులతో అనవసర వాదనలకు దిగుతున్నారన్నారు. ఇలాంటి ఘటనలు వ్యవస్థకు ఆరోగ్యకరమైన సంకేతం కాదన్నారు. న్యాయవాదులు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. 26 ఏళ్లుగా న్యాయ వ్యవస్థతో సంబంధం ఉన్న తనకు న్యాయవాదుల సమస్యలు గురించి తెలుసన్నారు. బెంచ్‌, బార్‌ కలిసి పనిచేయడం ద్వారా న్యాయం అందించే వ్యవహారంలో అద్భుతాలు చేయవచ్చన్నారు. నిందితులను మెజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్‌కు పంపుతున్నారన్నారు.

రిమాండ్‌ విధించేటప్పుడు తాము పవిత్రమైన విధిని నిర్వహిస్తున్నామనే విషయాన్ని మరిచిపోతున్నారన్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్‌ లలిత కుటుంబ సభ్యులు, హైకోర్టు న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, సిబ్బంది హాజరయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జస్టిస్‌ లలిత, విజయ్‌ప్రసాద్‌ దంపతులను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అంతకుముందు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకీరామిరెడ్డి, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు, సహాయ సొలిసిటర్‌ జనరల్‌ హరినాథ్‌.. జస్టిస్‌ లలిత అందించిన న్యాయసేవలను గుర్తుచేశారు. ఏజీ శ్రీరామ్‌ తరఫున ఆయన ప్రసంగాన్ని జానకీరామిరెడ్డి చదివి వినిపించారు.

ఇదీ చదవండి:

appsc: స్త్రీ, శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ABOUT THE AUTHOR

...view details