ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 6, 2022, 9:59 AM IST

ETV Bharat / city

డోపమ్స్​తో స్మగ్లర్ల గుట్టు రట్టు.. సాంకేతిక అస్త్రాన్ని తెరపైకి తెచ్చిన తెలంగాణ పోలీసులు

Dopams APP For Drug Offenders: ముఠాలోని స్మగ్లర్ల గురించిన సమాచారం అందరికీ అందుబాటులో ఉండేలా.. తెలంగాణ పోలీసులు సరికొత్త సాంకేతిక అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఆధ్వర్యంలో ‘డ్రగ్‌ అఫెండర్స్‌ ప్రొఫైలింగ్‌, అనాలిసిస్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (డోపమ్స్‌)’ పేరుతో యాప్‌ను రూపొందించారు. మాదకద్రవ్యాల ముఠాల సమగ్ర వివరాలతో కూడిన డేటా దీనిలో నిక్షిప్తమై ఉంటుంది.

Dopams APP For Drug Offenders
Dopams APP For Drug Offenders

Dopams APP For Drug Offenders: మాదకద్రవ్యాల ముఠాలు, సైబర్‌ నేరగాళ్లు ఒక ప్రాంతంలో నేరానికి పాల్పడితే ఆ సమాచారం అక్కడితోనే ఆగిపోతోంది. మరో ప్రాంతంలో నేరం చేసినప్పటికీ పాత నేరం గురించి పోలీసులకు తెలియడం లేదు. డీఆర్‌ఐ, ఎన్‌సీబీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతోపాటు ఆయా రాష్ట్రాల శాంతిభద్రతల పోలీసులకు చిక్కుతున్న ముఠాల సమాచారం కూడా ఆయా ఏజెన్సీలకే పరిమితమవుతోంది. ఆయా ముఠాల్లోని స్మగ్లర్ల గురించిన సమాచారం అందరికీ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు సరికొత్త సాంకేతిక అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. మాదకద్రవ్యాల ముఠాల సమగ్ర వివరాలతో కూడిన డేటాను అందుబాటులోకి తీసుకురావడంలో నిమగ్నమయ్యారు. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఆధ్వర్యంలో ‘డ్రగ్‌ అఫెండర్స్‌ ప్రొఫైలింగ్‌, అనాలిసిస్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (డోపమ్స్‌)’ పేరుతో యాప్‌ను రూపొందించారు. రాష్ట్రంలో సైబర్‌ నేరాలూ పెరుగుతున్న నేపథ్యంలో ఆ గ్యాంగుల వివరాలతో మరో చిట్టా సిద్ధం చేస్తున్నారు. మాదకద్రవ్యాల రవాణాకు సంబంధించి ఎన్‌డీపీఎస్‌ (నార్కొటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌) యాక్ట్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసులకు సంబంధించిన వివరాల్ని ఈ యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 746 శాంతిభద్రతల పోలీస్‌స్టేషన్లలో ఈ యాప్‌ను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే మనుగడలో ఉన్న టీఎస్‌-కాప్‌ యాప్‌కు డోపమ్స్‌ను అనుసంధానించారు.

పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలిసి పోయేలా?

Drug Offenders Profiling: మాదకద్రవ్యాల స్మగ్లర్ల సమగ్ర సమాచారం తెలుసుకునేలా డోపమ్స్‌ను రూపొందించారు. స్మగ్లర్‌ పేరు, చిరునామా, బంధువులు, సన్నిహితుల వివరాలు మొదలుకుని సదరు వ్యక్తి ఎక్కడి నుంచి మాదకద్రవ్యాలను సేకరిస్తాడు? ఎక్కడికి తరలిస్తాడు? అతను స్మగ్లింగ్‌ చేసే విధానం ఏమిటి? రవాణాదారా లేక సరఫరాదారా? ఎవరెవరికి సరఫరా చేశారు? ఇప్పటివరకు ఎన్ని కేసుల్లో ప్రమేయముంది? తదితర పూర్తి వివరాల్ని యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు.

సైబర్‌ నేరగాళ్ల చిట్టా సిద్ధం

రాష్ట్రంలో సైబర్‌ నేరాలు ఏటికేడు రెట్టింపు అవుతున్నాయి. 2019లో 2,240 కేసులు నమోదు కాగా 2020లో 4,544, 2021లో ఏకంగా 8,839 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.300 కోట్ల వరకూ సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టారని అంచనా. బాధితుల సంఖ్య పెరిగిపోతుండటంతో కేంద్ర జాతీయ స్థాయిలో ప్రారంభించిన నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌.సి.ఆర్‌.పి) తరహాలో తెలంగాణ పోలీసులు సిటిజన్‌ ఆన్‌లైన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ సిస్టం (సి.ఎఫ్‌.సి.ఎఫ్‌.ఆర్‌.ఎం.ఎస్‌) ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో ఎవరైనా సరే 155260కుగానీ, డయల్‌ 100, 112కుగానీ ఫోన్‌చేస్తే, వివరాలు సేకరించి వారి ఖాతాల ద్వారా జరిగిన నగదు బదిలీలను వెంటనే నిలిపివేస్తారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి నేరగాళ్లకు సంబంధించి వివరాలతో ప్రొఫైల్‌ సిద్ధంచేస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే 9,921 బ్యాంకు ఖాతాలు, 22,319 సిమ్‌కార్డుల ద్వారా నిందితుల వివరాలు సేకరించారు. ఈ వివరాలను ఆయా రాష్ట్రాల పోలీసులతోనూ పంచుకుంటున్నారు. ‘‘ఒకసారి ప్రొఫైల్‌ సిద్ధమైన తర్వాత నిందితుడ్ని పట్టుకోవడం సులభమవుతుంది. అన్ని రాష్ట్రాల పోలీసులకూ సమాచారం ఉంటుంది కనుక నిందితులు ఎక్కువకాలం తప్పించుకు తిరగలేరు. భవిష్యత్తులో వీరికి సిమ్‌కార్డులు దక్కకుండా చేయడం, బ్యాంకు ఖాతాలను రద్దు చేయించడానికి ఈ వివరాలు ఎంతగానో ఉపయోగపడతాయి’’ అని సైబర్‌క్రైం విభాగం వర్గాలు వెల్లడించాయి.

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా..

డోపమ్స్‌లో తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోని ఎన్‌డీపీఎస్‌ కేసుల వివరాలనూ నమోదు చేయనున్నారు. ఇందుకోసం సీసీటీఎన్‌ఎస్‌లోని సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 14,368 శాంతిభద్రతల ఠాణాల్లోని స్మగ్లర్ల వివరాలు క్రమేపీ డోపమ్స్‌లో నమోదుకానున్నాయని, మరికొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల ముఠాలకు సంబంధించిన సమాచారానికి డోపమ్స్‌ వేదిక కానుందని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. ‘‘ఒక స్మగ్లర్‌ ఎన్‌డీపీఎస్‌ కేసులో చిక్కితే అతడి గత చరిత్రను అక్కడికక్కడే తెలుసుకునేందుకు ఈ యాప్‌ వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు దిల్లీలో నమోదైన మాదకద్రవ్యాల కేసులో తప్పించుకుతిరుగుతున్న ముఠా సభ్యులు తమిళనాడులో మరో కేసులో చిక్కితే, వెంటనే ఆ సమాచారాన్ని దిల్లీ పోలీసులకు అందించే వీలు కలుగుతుంది. పదేపదే నేరాలకు పాల్పడేవారిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని’’ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:IT Raids On Real Estate companies : ఐటీ దాడుల కలకలం...మూడు రాష్ట్రాల్లో సోదాలు

ABOUT THE AUTHOR

...view details