రాష్ట్రంలో గత నెల 22 వరకు మొత్తం కేసుల సంఖ్య 3,45,216 ఉండగా... ఈ 12 రోజుల్లో దాదాపు ప్రతిరోజూ 10 వేలకు పైగానే కొవిడ్ బాధితులు పెరిగారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు లక్షా 10వేల 315 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మార్చి 10వ తేదీ నాటికి ఒక్క కేసూ నమోదు కాలేదు. తొలి కేసు మార్చి 12న నెల్లూరు జిల్లాలో నమోదయ్యింది. ఆ తర్వాత ఏప్రిల్ 10 నాటికి 381కి కేసులు పెరిగాయి. వాటిలో అత్యధికం దిల్లీలోని ఓ సమావేశానికి హాజరయిన వారివే. మే 10 నాటికి ఆ కేసులు 1,910కి పెరిగాయి. దాదాపుగా మూడు రెట్ల వరకూ కొత్త కేసులు వచ్చాయి. ఈ సమయంలో తమిళనాడు కోయంబేడు మార్కెట్ కారణంగా వచ్చిన కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
ఒకే నెలలో ఆరు రెట్లు...
జూన్ 10 నాటికి కేసుల సంఖ్య 4,126కి పెరిగింది. అంటే దాదాపు రెట్టింపు అయ్యాయి. ఆ తర్వాత లాక్డౌన్ సడలింపులు ఏపీలో కేసులు వేగంగా పెరగడానికి ప్రధాన కారణం అయ్యింది. ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన వారితో కేసులు అమాంతంగా పెరగడం ప్రారంభమయ్యింది. జులై 10 నాటికి ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24,422కి చేరింది. అంటే ఒకే నెలలో ఆరు రెట్లు కేసులు పెరిగాయి.
నెల రోజుల్లో 2 లక్షలకు పైగా కేసులు
గడిచిన నెల రోజులు గమనిస్తే లాక్డౌన్కి మరిన్ని సడలింపులు తోడైన కారణంగా కరోనా విస్తృతి భారీగా కనిపిస్తోంది. ప్రస్తుతం కేసులు రెట్టింపు కావడానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే తీసుకుంటుందంటే పరిస్థితి అర్థమవుతోంది. దేశంలో మరే రాష్ట్రంలోనే ఇంత వేగంగా కేసులు పెరగటం లేదు. ఆగస్టు 10 నాటికి ఆంధ్రప్రదేశ్లో కరోనా బాధితుల సంఖ్య 2,35,525కి చేరింది. అంటే జులై 10 తర్వాత నెల రోజుల్లోనే 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నిత్యం దాదాపు 10,000 కేసులు కొత్తవి కనిపిస్తున్నాయి. కరోనా ఎంత వేగంగా విస్తరిస్తోందనే విషయం ఈ అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.