రోజుకు 2 టీఎంసీల గోదావరి వరద జలాలను... కర్నూలు జిల్లా బనకచర్లకు తరలించడమే లక్ష్యంగా ప్రాజెక్టులు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీజన్కు 200 టీఎంసీల నీరు తీసుకెళ్లాలని నిర్దేశించారు. నదీ జలాల తరలింపుపై సమీక్షించిన సీఎం జగన్... జనవరి నెలాఖరు వరకు డీపీఆర్ సిద్ధం చేయాలని సూచించారు.
గోదావరి నుంచి కృష్ణా నదిలోకి, అక్కడి నుంచి ప్రతిపాదిత బొల్లాపల్లి రిజర్వాయర్కు, అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తరలించనున్నట్లు సీఎం జగన్ వివరించారు. పోలవరం కుడి కాల్వ సామర్థ్యం పెంపు, అక్కడి నుంచి కృష్ణా నదిలోకి, నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాల్వ ద్వారా బొల్లాపల్లికి తరలించాలని అధికారులకు చెప్పారు. ఈ సందర్భంగా వాప్కోస్ ప్రతినిధులు తమ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు.