హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ నీటిలో కరోనా వైరస్ ఉందంటున్నారు పరిశోధకులు. నగరంలోని పలు చెరువుల్లో నీటి నమూనాలపై ఐఐసీటీ, సీసీఎంబీ ఆధ్వర్యంలో పరిశోధనలు చేసినట్లు తెలిపారు. నీటి వనరుల నమూనాల్లోని కరోనా వైరల్ లోడు ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. వైరస్ సంక్రమణ వ్యాప్తిని ముందే తెలుసుకునేందుకు ఐఐసీటీ, సీసీఎంబీ గతేడాది నుంచి మురుగునీరు, చెరువుల్లో నీటి నమూనాలను తరచూ సేకరించి విశ్లేషిస్తోంది.
నాచారంలోని పెద్ద చెరువు కేంద్రంగా ఏడు నెలలుగా నీటి నమూనాలను సేకరించి పరిశోధనలు చేశారు. మొదట్లో నెలవారీగా విశ్లేషించగా.. ప్రస్తుతం వారం రోజులకోసారి సేకరించి విశ్లేషిస్తున్నారు. దీంతోపాటు నగరంలోని హుస్సేన్సాగర్, ప్రగతినగర్లోని తుర్కచెరువు, నాచారం పెద్ద చెరువు, శివారులో ఘట్కేసర్లోని ఏదులాబాదు చెరువు, పోతరాజు చెరువుల నుంచి నమూనాలు సేకరించి విశ్లేషించారు.
నాచారం చెరువు నుంచి:
● కొవిడ్ మొదటి ఉద్ధృతి ఆఖరు, రెండో ఉద్ధృతి ఆరంభంలో చెరువు నీటి నమూనాల్లోని వైరల్ లోడులో స్పష్టమైన తేడాను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. నవంబరులో మొదటి ఉద్ధృతి గరిష్ఠ స్థాయిలో ఉందని తేల్చారు. డిసెంబరు నుంచి జనవరి వరకు తగ్గుతూ వచ్చింది.