ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 9, 2020, 6:25 AM IST

Updated : Jan 9, 2020, 12:24 PM IST

ETV Bharat / city

భగ్గుమన్న బెజవాడ: చంద్రబాబు అరెస్టు... విడుదల!

విజయవాడలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా ఇతర నేతల అడ్డగింపు పెనుదుమారం రేపింది. ఒక్కసారిగా బెజవాడ బెంజి సర్కిల్ ప్రాంతం భగ్గుమంది. తీవ్రఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వేలాదిగా తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు, మద్దతుదారులతో బెజవాడ నడిబొడ్డు జనసంద్రమైంది. తోపులాటలు, ఈడ్చివేతలు, అరెస్టులు, పెనుగులాటలు, రహదారి దిగ్బంధనం పరిణామాల మధ్య చంద్రబాబు, అమరావతి పరిరక్షణ కమిటీ నేతలను బలవంతంగా పోలీసువ్యాన్‌లో తరలించి..ప్రతిపక్షనేత నివాసం వద్ద విడిచిపెట్టారు.

అట్టుడుకిన బెజవాడ
అట్టుడుకిన బెజవాడ

అట్టుడుకిన బెజవాడ

అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రను పోలీసులు అఢ్డుకున్నారు. బుధవారం సాయంత్రమే బస్సులను సీజ్ చేసి విజయవాడ ఆటోనగర్ ప్రాంతంలోని ఏపీఐఐసీ కార్యాలయం వద్దకు తరలించారు. దీనిని నిరసిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెజవాడ బెంజిసర్కిల్ నుంచి బస్సులు ఉన్న ప్రదేశం వరకూ కాలినడకన వెళ్లాలని నిర్ణయించారు. చంద్రబాబు వెంట నేతలంతా పాదయాత్రగా వెళ్లి.. బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించటంతో పోలీసులు నిరాకరించారు. చంద్రబాబు సహా ఇతర తెలుగుదేశం ముఖ్యనాయకులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఐకాస నేతలను బెంజిసర్కిల్ వద్దే అడ్డుకున్నారు.

ధ్వజమెత్తిన చంద్రబాబు

శాంతియుతంగా వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవటంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్ని అనుమతులు తీసుకున్న తమను..ఆపటం సరికాదన్నారు. పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.చంద్రబాబు రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న విషయం..వ్యాపించటంతో బెంజిసర్కిల్ ప్రాంతానికి... పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. చంద్రబాబు, ఐకాస నేతలు చేపట్టిన నిరసనకు బాసటగా ఆందోళనలు చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బెంబేలెత్తిన బెజవాడ

దాదాపు నాలుగున్నర గంటల పాటు బెంజిసర్కిల్ ప్రాంతం..బెజవాడను బెంబేలెత్తించింది. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు.. చంద్రబాబుతోపాటు ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఫలితంగా వాతావరణం మరింత వేడెక్కి ఘర్షణ పరిస్థితులకు దారితీసింది.నేతలందరినీ ఒకే బస్సులో ఎక్కించిన పోలీసులు... వారిని తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే వేలాదిగా ప్రజలు తరలిరావటంతో ప్రాంగణం కిక్కిరిసింది. నేతలు ప్రయాణిస్తున్న బస్సుకు అడ్డం పడుతూ కదలకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కొందరిని ఇష్టం వచ్చినట్లు ఈడ్చిపడేశారు. మరికొందరిని ఎత్తి వ్యానుల్లోకి విసిరేశారు. ఈక్రమంలో అనేకమందికి గాయాలయ్యాయి.

తాళం మాయం

ఇదే క్రమంలో మరికొంతమంది జాతీయ రహదారి నిర్భంధించటంతో వారిని చెదరకొట్టేందుకు పోలీసులు లాఠీలు, రోప్ పార్టీలను ప్రయోగించారు. చంద్రబాబు, ఇతర నేతలను ఎక్కించిన వాహనం తాళాలను గుర్తు తెలియని వ్యక్తులు తీసివేసి...పరుగులు పెట్టారు. పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా తాళాలను మురికిగుంటలో పడేయటంతో బస్సు కదిలే పరిస్థితి లేకుండా అయింది. వాహనం ఎక్కించిన వారిని దించి వేరొక వాహనంలోకి ఎక్కించాలన్నా...ప్రజలు, కార్యకర్తలు... పెద్దఎత్తున గుమ్మిగూడటంతో నేతలెవ్వరూ వాహనం దిగే పరిస్థితి లేకుండా పోయింది. ఆ సమయంలో వాహనం చుట్టూ ఉన్న ప్రజలు, మద్దతుదారులను పోలీసులు బలవంతంగా నెట్టివేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి.

స్తంభించిన ట్రాఫిక్

వాహనం తాళం లేకపోయినా... ప్రత్యామ్నాయ మార్గంతో పోలీసులు స్టార్ట్ చేయటంతో అదే బస్సులో చంద్రబాబు సహా ఇతర నేతలను తరలించారు. ఉండవల్లి కరకట్టమీద ఉన్న ప్రతిపక్షనేత నివాసంలో అందరినీ విడిచిపెట్టారు. పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించిన వారిని అదుపులోకి తీసుకుని.... విజయవాడ, కృష్ణాజిల్లా పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ పరిణామాలతో సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 10 గంటలు వరకూ.... చెన్నై-కోల్‌కతా జాతీయరహదారితో పాటు హైదరాబాద్-మచిలీట్నం జాతీయరహదారులు రెండూ పూర్తిగా స్తంభించిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇదీచదవండి

చంద్రబాబును విడిచిపెట్టిన పోలీసులు

Last Updated : Jan 9, 2020, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details