By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 18, 2024, 11:24 AM IST
వెలుగులోకి మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి భూ కబ్జా- చర్యలకు ఆదేశించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు - EX MLA Thippeswamy Land Grab
EX MLA Thippeswamy Land Grab : గత వైఎస్సార్సీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు భూదాహంతో కనిపించిన భూములను మింగేశారు. ఏ భూమైనా సరే వారికి నచ్చిందంటే అది హాంఫట్. ప్రతి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ భూమి అనే తేడా లేకుండా ఆక్రమించేశారు. ఇప్పుడు ఆ భూదోపిడీ పర్వాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఉదుగూరు గ్రామంలో పర్యటించారు. అక్కడి కాలనీలలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి తన ఇంటి వద్ద ఉన్న ఆర్అండ్బీ స్థలాన్ని ఆక్రమించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. అంతేకాక భూమి చుట్టూ ప్రహరీ గోడలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ఎంస్ రాజు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. ఆ భూమిని సర్వే చేయించి అందులోని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. తిరిగి ఆ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి స్పందించారు. తాను ఆర్అండ్బీ భూమిని ఆక్రమించి ఉంటే సర్వే చేయించవచ్చని స్పష్టం చేశారు.