సిద్దిపేట జిల్లాలో లాక్డౌన్ సడలింపుతో సింహభాగం మండల కేంద్రాల్లో నిషేధిత జాబితాలో ఉన్నవి మినహాయించి అన్ని రకాల దుకాణాలు తెరుచుకున్నాయి. పురపాలికల్లో మాత్రం అన్ని రకాల దుకాణాలు తెర్చుకోలేదు. గ్రామాల నుంచి మండలాలు, పట్టణ కేంద్రాలకు నామమాత్రంగా ఆటోలు నడిచాయి. రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల్లో కార్యకలాపాలు షురూ అయ్యాయి. దాదాపు 45 రోజుల నిర్బంధం తర్వాత సడలింపు ఇవ్వడంతో ప్రజలు కాస్త స్వేచ్ఛగా రహదారులపైకి రావడం గమనార్హం. సిద్దిపేటలో కొన్ని మిఠాయి దుకాణాలు తెరిచారు. ఇవి నిషేధిత జాబితాలో ఉన్నాయి. దీంతో బల్దియా అధికారులు వాటిని మూసివేయించారు.
గజ్వేల్ పురపాలికలో భవన నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలు ప్రారంభం కాలేదు. చేర్యాల, హుస్నాబాద్ పురపాలికల్లోనూ ఇదే స్థితి నెలకొంది. దుబ్బాకలో దాదాపు అన్ని రకాల దుకాణాల్లో కార్యకలాపాలు షురూ అయ్యాయి. పురపాలికల్లో 50 శాతం దుకాణాలు తెరవాలనే నిబంధన విధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఈ మేర నిర్ణయం ప్రకటించడం వల్ల బుధవారం బల్దియా అధికారులు ఈప్రక్రియను అమలు చేయలేకపోయారు. వైద్య, భవన నిర్మాణ, వ్యవసాయ అనుబంధ రంగాలు, నిత్యావసర సరకుల విభాగంలోని దుకాణాలను నిత్యం తెరిచే అవకాశం ఉంది. నిషేధిత జాబితాలో లేని వస్త్ర, ఫుట్వేర్, బుక్డిపో తదితరాలకు ప్రత్యేకంగా నంబర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తేదీల వారీగా బేసి, సరి సంఖ్యల ఇచ్చి దుకాణాలు తెరిచేలా చూడాలని ఉత్తర్వులు జారీ చేసింది. దుబ్బాకలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
గ్రామాల నుంచి పట్టణాలకు...