Dr Modala Mallesh: నల్లొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ మోదాల మల్లేష్.. పుడమి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాయం నుంచి జంతుశాస్త్ర విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసిన మల్లేష్.. డిగ్రీ విద్యార్థుల కోసం పుస్తకాలను రచించారు. ప్రతి ఏడాది పీజీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. సివిల్స్, గ్రూప్స్తో పాటు ఇతర పోటీ పరీక్షల కోసం రాసిన విద్యా సంబంధిత వ్యాసాలు ప్రముఖ తెలుగు దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి.
మల్లేష్ విద్యా ప్రస్థానం..
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మల్లేష్ పీజీ పూర్తి చేశారు. డాక్టర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి సీపీఎఫ్ఎన్ను పొందారు. కాకతీయ విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగం సహాయ ఆచార్యురాలు డాక్టర్ చింత స్రవంతి పర్యవేక్షణలో పరిశోధన చేశారు. 'సీజనల్ డైవర్సిటీ ఆఫ్ పెస్ట్స్ అండ్ ప్రిడేటర్స్ ఇన్ బీటీ అండ్ నాన్ బీటీ కాటన్ ఫీల్డ్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్' అనే అంశంపై పరిశోధించారు. ఈ పరిశోధన ముఖ్యంగా పత్తి రైతు, పెస్టిసైడ్ కంపెనీలకు ఎంతో ఉపయోగపడుతుందని అధ్యాపకులు తెలిపారు. ఈ పరిశోధన కాలంలో ఆయన రాసిన ఐదు వ్యాసాలు.. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి.
గతంలో నకిరేకల్, సూర్యాపేటలోని పలు డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుడిగా మల్లేష్ పని చేశారు. ప్రస్తుతం నకిరేకల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ లెక్చరర్గా (గెస్ట్ ఫ్యాకల్టీ) విధులు నిర్వర్తిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మల్లేష్ విద్యారంగంలో చేస్తున్న కృషిని గుర్తించి పుడమి సాహితీ వేదిక జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు వెల్లడించింది. మార్చి6న హైదరాబాద్లో పురస్కారాన్ని అందిస్తామని పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చిలుముల బాల్రెడ్డి ప్రకటించారు.