కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని డంపింగ్ యార్డు గుట్టలు గుట్టలుగా నిండింది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు తోడు పెరిగిన ఇళ్లకు తగ్గట్లుగా చెత్త ఉత్పత్తి పెరిగింది. దీన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ప్రతి ఇంటి నుంచి సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తీసుకొచ్చిన చెత్తను నిల్వ చేసేందుకు కూడా స్థలం లేకుండా మారింది. రోజుకు టన్నుల కొద్దీ చెత్త బయటకు వస్తుండటంతో నగరానికి ఇదే పెద్ద సమస్యగా మారింది.
‘తడి, పొడి’పై పెరిగిన అవగాహన
తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలన్న ప్రచారంతో ప్రజల్లో కొంతమేర అవగాహన పెరిగింది. ఇందుకోసం ఇదివరకే తడి, పొడి డబ్బాలు అందజేశారు. ఇంటి నుంచే చెత్తను వేరు చేసి ఇవ్వడంతో డంపింగ్ యార్డుకు వచ్చే చెత్త 10 శాతం తగ్గింది. నగరంలో ప్రతి రోజూ 5 మెట్రిక్ టన్నుల తడి చెత్తను రెండు వర్మీ కంపోస్టు యార్డులకు తరలిస్తున్నారు. పొడి చెత్తను డీఆర్సీసీ కేంద్రానికి పంపిస్తున్నారు. పొడి చెత్తలో పనికి రాని వస్తువులు సేకరించి రీసైక్లింగ్కు పంపించడం, మిగతా పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తుండటంతో 15 మెట్రిక్ టన్నుల మేర తగ్గింది.
నిల్వల తగ్గింపునకు సర్వే
ప్రస్తుత డంపింగ్ యార్డులో చెత్తను తగ్గించడం కోసం బయోమైనింగ్ కోసం పలుమార్లు పరిశీలించారు. సదరు సంస్థ యార్డును సందర్శించి ఎంత లోతులో చెత్త ఉందనే విషయాన్ని ఆరా తీసి వివరాలు నమోదు చేసుకుంది. ఈ వివరాలను గత పాలనాధికారికి కూడా అందించినట్లు సమాచారం. ఉన్న స్థలంలోనే చెత్తను తగ్గించడం కోసం అధికారులు అంచనాలు రూపొందించారు. కాగా స్మార్ట్సిటీ పథకంలో రూ.10 కోట్ల నిధులు కూడా కేటాయించారు.