ఆపరేషన్ స్మైల్లో భాగంగా జనగామ జిల్లా వ్యాప్తంగా అధికారులు చేపట్టిన తనిఖీలు మార్పు వైపునకు అడుగులు పడుతున్నాయి. ఫలితంగా బాల్యంలోనే బందీలుగా మారుతున్న చిన్నారులకు సకాలంలో విముక్తి కలుగుతోంది.
బాలల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం జనవరిలో నిర్వహించే ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ఎంతో మంది బాలల భవిష్యత్తుకు బాసటగా నిలిచింది. జనవరి ఒకటో తేదీ నుంచి 31 వరకు తప్పిపోయిన బాలలను గుర్తించడం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నియంత్రణతో పాటు భిక్షాటన చేసే చిన్నారులు, వీధిబాలలు, అనాథలు, బడిమానేసిన చిన్నారులు, ఇతరత్రా అంశాల్లో వారిని గుర్తించి విముక్తి కల్పించడమే లక్ష్యంగా అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు.
!['Operation Smile' programme is yielding good results across Jangaon district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10672823_op.jpg)
పలు శాఖల సహకారంతో..
ముందుగా చేపట్టాల్సిన పనులపై వివిధ శాఖల అధికారులు సమీక్షలు నిర్వహించి ప్రణాళికలు తయారు చేసుకున్నారు. నిర్ణయించిన లక్ష్యాలతో గత నెలలో జిల్లావ్యాప్తంగా 12 మండలాల్లో ఐసీపీఎస్, ఐసీడీఎస్, పోలీసు, కార్మిక, విద్య, వైద్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాల కార్మికులను గుర్తించడానికి రంగంలోకి దిగారు. రెవెన్యూ డివిజన్ల వారీగా అధికారులు బృందాలుగా ఏర్పడి పరిశీలన చేపట్టారు. బాలల సంరక్షణ కేంద్రాలను సందర్శించారు. జిల్లావ్యాప్తంగా వివిధ రకాల దుకాణాలు, ఇటుక బట్టీలు, కోళ్ల ఫారాలు, పరిశ్రమలు, భవన నిర్మాణ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ తనిఖీలు చేపట్టి పలువురు బాల కార్మికులను గుర్తించి వారికి ఆయా పనుల నుంచి విముక్తి కల్పించారు.
నవ్వులు పూయించారు..
జిల్లా బాలల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో 8 మంది అధికారులు, సిబ్బంది, రెస్క్యూ బృందం సభ్యుల శ్రమతో దాదాపు 100 మంది చిన్నారుల కళ్లలో ఆనందాన్ని నింపారు. అధికారుల కృషితో వివిధ రకాల పనులుచేస్తున్న 80 మంది బాలురు, 20 మంది బాలికలను గుర్తించారు. వీరిలో నలుగురు భిక్షాటన చేస్తున్నట్లు అధికారులు గురితంచారు. బాలలకు పనులు కల్పించిన దుకాణాదారులు, పనిలో చేర్పించిన తల్లిదండ్రులకు అధికారులు కౌన్సెలింగ్ చేశారు. దేవరుప్పులలో వివిధ దుకాణాల్లో జనవరి 21న అధికారులు దాడులు చేసి ఆయా చోట్ల పనులు చేస్తున్న బాలలను గుర్తించారు. వారికి పనులు కల్పించిన యజమానులను మొదటి తప్పుగా పరిగణించి నోటీసులు అందించారు. పునారవృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తల్లిదండ్రులదే బాధ్యత..
కరోనా వ్యాప్తితో విధించిన లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడడంతో చదువుకునే పిల్లలు చాలా వరకు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో సమస్య అధికమైంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చదువుకునే పిల్లలకు మళ్లీ చదువు చెప్పించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఆన్లైన్లో పాఠాలు చెబుతుండడంతో తల్లిదండ్రులూ బాధ్యత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలు మూసివేయడంతో కొందరిని పనిలో పెట్టినట్లు చెప్పారు. అధికారుల కౌన్సెలింగ్ తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నామని తెలిపారు.