మౌనిక మృతికి కుటుంబ సభ్యులే కారణం: పోలీసులు గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో శవమై తేలిన మౌనిక కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుటుంబ సభ్యుల వల్ల మానసిక, శారీరక వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడినట్లు గోపాలపురం ఏసీపీ వెంకటరమణ స్పష్టం చేశారు. మొదటగా ఇతర బస్తీకి చెందిన వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి చంపేసినట్లు పోలీసులు భావించినా.. అందులో వారి పాత్ర లేదని తేలింది.
బావలు, సోదరులే కారణం..
పోలీసుల విచారణలో వారి కుటుంబ సభ్యులైన ఇద్దరు మౌనిక బావలు, ఇద్దరు సోదరులు ఆమె మృతికి కారణమయ్యారని పోలీసులు పేర్కొన్నారు. ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన మౌనిక బావలు సోమశేఖర్ (కేబుల్స్ టెక్నీషియన్), ఆంటోనీ(డ్రైవర్)లు అదే విధంగా ఆమె సోదరులు శివ కుమార్, సాయికుమార్ వృత్తిరీత్యా కూరగాయలు విక్రయిస్తారని తెలిపారు. వీళ్ళంతా కలిసి మానసికంగా, శారీరకంగా వేధించారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
సెల్ఫోన్ ఆధారంగా..
ఆమె చనిపోయేముందు తన స్నేహితులకు ఫోన్ చేసి.. తన బావలు, అన్నలు వేధించడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె బాధతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మౌనిక సెల్ ఫోన్ రికార్డింగ్ ఆధారంగా నలుగురిని రిమాండ్కు తరలించారు. మౌనిక మారేడుపల్లిలోని ఓ కళాశాలలో ఎమ్మెల్టీ కోర్స్ చేస్తున్నట్లు తెలిపారు. కళాశాలకు వెళ్తున్నానని చెప్పి తిరిగి రాకపోవడం వల్ల బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇంటి నుంచి అదృశ్యమైన రోజు హుస్సేన్ సాగర్లో దూకి చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. డిసెంబర్ 9న ఆచూకీ కనుగొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దేహాన్ని అప్పజెప్పిన పోలీసులు కేసులో నిర్లక్ష్యం వహించారని తీవ్ర ఆగ్రహానికి లోనై.. తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు.
ఇవీ చూడండి:తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త