హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 5 వేలక్లినిక్లు ఉంటాయని అంచనా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే ప్రొఫెసర్లు, కార్పొరేట్ ఆసుపత్రుల కన్సల్టెంట్ వైద్యులు... కాలనీలు, ఇతర చిన్న వీధుల్లో క్లినిక్లను నిర్వహిస్తుంటారు. కరోనా ప్రభావంతో వీటి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.
నిబంధనలు పాటిస్తేనే..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు ఓపీలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు అధిక శాతం దవాఖానాలు అన్ని జాగ్రత్తలు తీసుకొని మూడు రోజుల నుంచి ఓపీ సేవలు ప్రారంభించాయి. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరినీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ.. ఎడం పాటించేలా చూస్తున్నారు.
జ్వరం, ఇతర లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. కాలనీల్లో ఉండే క్లినిక్ల్లోనూ ఇలాంటి జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంది. చాలావరకు చిన్న చిన్న గదుల్లో కొనసాగుతుండటంతో ఇవన్నీ సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాస్త ఎక్కువ స్థలంలో నడుస్తున్న క్లినిక్లు, నర్సింగ్ హోంల విషయంలో నిబంధనల ప్రకారం ఓపీలు ప్రారంభించినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ప్రజలు ప్రాథమిక చికిత్స కోసం సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.