Amruthabhumi preview: హైదరాబాద్ అమీర్పేట సారథి స్టూడియోలో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో "అమృతభూమి" చలన సినిమా ప్రివ్యూ ప్రదర్శన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ సహకారంతో ప్రకృతి అతిథిదేవోభవ ప్రొడక్షన్స్ నేతృత్వంలో నిర్మించిన ప్రకృతి సేద్యం చిత్రం "అమృతభూమి" ప్రదర్శించారు. వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ - ఏఎస్సీఎస్ డైరెక్టర్ చక్రపాణి, ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీబీఐ పూర్వ సంయుక్త సంచాలకులు జేడీ లక్ష్మీనారాయణ, రైతునేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి, నాబార్డు విశ్రాంత సీజీఎం పాలాది మోహనయ్య, "జట్టు" స్వచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ డి.పారినాయుడు తదితరులు ఈ చిత్రం వీక్షించారు. త్వరలో విడుదల కానున్న "అమృతభూమి" చిత్రం పోస్టర్ను విడుదల చేశారు.
ప్రముఖ నటుడు ప్రసాదబాబు సహా మాజీ మంత్రి పుష్పలత, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయకుమార్, ఇతర ఔత్సాహిక కళాకారులు నటించిన ఈ చిత్రానికి స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం కోరుకొండ బ్రహ్మానందం. కథ, పాటలు దివంగత వంగపండు ప్రసాదరావు. తొలిసారి పూర్తి నిడివితో 100 శాతం ప్రకృతి వ్యవసాయం స్ఫూర్తిగా నిర్మించిన ప్రభోదాత్మక చిత్రం "అమృతభూమి" అద్భుతంగా ఉందని ప్రముఖులు ప్రశంసించారు. సందేశాత్మక చిత్రాలు నిర్మించినా ప్రేక్షకులు సరిగా ఆదరించకపోగా... థియేటర్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. నలుగురైదురు చేతుల్లో ధియేటర్లు ఉండటం వల్ల దొరకడం లేదని... అయినా సేంద్రీయ ఆధారిత అవగాహన చిత్రం పాన్ ఇండియా, ప్రపంచ స్థాయిలో భాషలకు అతీతంగా తర్జుమా చేసి విడుదల చేయాలని ఆకాంక్షించారు.
పెట్టుబడులు తగ్గించి నాణ్యమైన దిగుబడులు లభించడం ద్వారా రైతులకు నిరక లాభాలు తెచ్చిపెట్టే ప్రకృతి సేద్యం ప్రోత్సాహంలో భాగంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వినోదం పన్ను మినహాయించి ప్రోత్సహించాలని ఆయన కోరారు. అభివృద్ధి పేరిట ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వెళుతున్నామని అందుకే.. ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నామని ఎల్వీ సుబ్రమణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. మానవాళి మితిమీరిన స్వార్థం వల్ల సంతృప్తే లేదని, ఇతరులకు ఏ కష్టం కలిగినా ఫర్వాలేదు... మనం సుఖంగా ఉండాలన్న దురాశ పెరిగిపోయిందని ఆయన వాపోయారు. "అమృతభూమి" రూపకల్పన చేసిన పారినాయుడు కృషి అభినందనీయమని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. తాను రాజమండ్రి వద్ద 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రీయ సేద్యం చేస్తున్నానని, మొదటి పంట తీసుకోబోతున్నానని తెలిపారు. సేంద్రీయ సేద్యంలో మూడేళ్లు తగ్గే దిగుబడులపై సర్కారు భరోసా ఇస్తే బాగుంటుందని, సర్టిఫికేషన్ ఏజెన్సీ వ్యవస్థ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, అంచెలంచెలుగా ముందుకువెళదామని ఆయన అభిప్రాయపడ్డారు.