ఒలింపిక్స్ను వాయిదా/రద్దు చేయాలన్న డిమాండ్లు నానాటికీ పెరుగుతున్నాయి. మెగా క్రీడల నిర్వహణ విషాదాంతం అవుతుందని అంటున్నారు. ఒకవేళ మొండిగా నిర్వహిస్తే సరికొత్తగా 'ఒలింపిక్ స్ట్రెయిన్' పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదని జపాన్ వైద్యుల సంఘం అధ్యక్షుడు నావోటో యుయేమా హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం జపాన్లో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోంది. ఆ దేశంలో కేవలం 5 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తైంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో నగరాల్లో అత్యయిక వైద్య పరిస్థితిని పొడగించారు. ఈ నేపథ్యంలో మెగా క్రీడలను రద్దు/వాయిదా వేయాలని 70% మంది ప్రజలు కోరుతున్నారు. ఒలింపిక్స్ ఆరంభ సమయానికి 90% మంది క్రీడాకారులకు టీకా కార్యక్రమం పూర్తవుతుందని, కఠిన ఆంక్షలు, బుడగల మధ్య క్రీడలు నిర్వహిస్తామని ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ప్రకటించాయి. దాంతో విమర్శలు మొదలయ్యాయి.
దాదాపుగా 200 దేశాలు, ప్రాంతాల క్రీడాకారులు, ప్రజలు టోక్యోకు వస్తారని జపాన్ వైద్య సంఘం అధ్యక్షుడు నావోటో వెల్లడించారు. అలాంటప్పుడు జులైలో క్రీడల నిర్వహణ ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చరించారు. 'ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఉత్పరివర్తనం చెందిన వేర్వేరు రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి. అక్కడి వాళ్లంతా టోక్యోలో ఒకే చోట చేరతారు. అందుకే ఒలింపిక్స్ తర్వాత ఓ కొత్త వైరస్ స్ట్రెయిన్ ఆవిర్భవించే అవకాశాలను కొట్టిపారేయలేం' అని ఆయన హెచ్చరించారు.