కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్కు షూటింగ్లో గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో 'ఖాకి' సినిమా దర్శకుడు హెచ్.వినోద్ దర్శకత్వంలో 'వలిమై' అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చెన్నైలో రెండో షెడ్యూల్ను తెరకెక్కిస్తోంది చిత్రబృందం. ఈ సందర్భంగా సోమవారం ఓ ఛేజింగ్ సన్నివేశం తీస్తుండగా ఈ స్టార్హీరోకు గాయాలైనట్లు సమాచారం. అయితే ఇరవై నిమిషాల విరామం తర్వాత చిత్రీకరణ పూర్తి చేసిన హాస్పిటల్కు వెళ్లాడట అజయ్. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హీరోకు కొన్ని రోజులు విశ్రాంతి సూచించారట వైద్యులు. ఈ వార్త ట్విట్టర్లో వైరల్గా మారింది. త్వరలో తదుపరి షెడ్యూల్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతుందని తెలుస్తోంది.
'పింక్' తమిళ రీమేక్ 'నేర్కొండ పార్వై' తర్వాత అజిత్, బోనీకపూర్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో విలన్గా కార్తికేయ నటించబోతున్నాడని కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇలియానా, యామిగౌతమ్లలో ఒకరు కథానాయికగా కనిపించే అవకాశం ఉందట. అంతేకాకుండా నయనతార, నజ్రియాలు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గౌతం మేనన్ దర్శకత్వంలోని 'ఎన్నై అరిందాల్' చిత్రం తర్వాత మళ్లీ చాలా రోజుల తర్వాత పోలీసు అధికారి పాత్ర పోషిస్తున్నాడు అజిత్.
ఈ తాజా చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చుతున్నారు. ఎప్పటిలాగే ఈ సినిమాకు అద్భుతమైన థీమ్ మ్యూజిక్ను రూపొందించారట యువన్. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నాడు. గతంలో వినోద్ దర్శకత్వంలో వచ్చిన 'సదురంగ వేట్టై', 'ధీరన్ అధిగారం ఒండ్రు', 'నేర్కొండ పార్వై’ చిత్రాలు మంచి విజయం సాధించాయి. 'వలిమై' సినిమా వచ్చే ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.