భారత్తో సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. ఓవైపు శాంతి మంత్రం పఠిస్తూనే మరోవైపు సరిహద్దులవైపు దూసుకొస్తోంది చైనా. భారత్తో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి తమ యుద్ధవిమానాల ఆపరేషన్లకు అడ్డంకులను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం.. తూర్పు లద్దాఖ్కు సమీపంలో షింజియాంగ్ రాష్ట్రంలోని షాక్సే నగరంలో యుద్ధ విమానాల ఆపరేషన్ కోసం కొత్త వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేస్తోంది.
" భారత సరిహద్దుల్లో యుద్ధ విమానాల కార్యకలాపాల కోసం ఇప్పటికే ఉన్న కష్గర్, హోగన్ ఎయిర్ బేస్లకు మధ్యలో కొత్త స్థావరాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కొత్త ఎయిర్ బేస్తో చైనా వాయుసేనకు ఆ ప్రాంతంలో ఉన్న పరిమితులను అధిగమించే అవకాశం ఉంది. షాక్సేలో ఇప్పటికే ఎయిర్ బేస్ ఉంది. ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఆపరేషన్ కోసం దానిని ఆధునికీకరిస్తున్నారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు సాగుతున్నట్లు కనిపిస్తోంది. "
- ప్రభుత్వ వర్గాలు.
ప్రస్తుతం చైనాలో ఉన్న యుద్ధ విమానాల ఎయిర్ బేస్కు, ఎల్ఏసీకి మధ్య సుమారు 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. షాక్సే ఎయిర్ఫీల్డ్తో ఫైటర్ల ఆపరేషన్ ఉన్న అడ్డంకులు తొలిగిపోనున్నాయి. .
భారత్ అప్రమత్తం..
ఉత్తరాఖండ్ సరిహద్దు నగరం బారహోటికి సమీపంలోని చైనా ఎయిర్ఫీల్డ్ను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఆ ప్రాంతంలో ఇటీవల పదుల సంఖ్యలో చైనాకు చెందిన మానవరహిత విమానాలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో అప్రమత్తమైంది. కొద్ది రోజుల క్రితం హోగన్, కష్గర్, గార్ గున్సా ఎయిర్ఫీల్డ్స్లో సైనిక ప్రదర్శనలు చేపట్టింది. అయితే.. ఎయిర్ బేస్ల విషయంలో భారత్తో పోలిస్తే చైనాకు అంత బలం లేదు. ఎల్ఏసీకి అతి సమీపంలోనే భారత్కు వాయుసేన స్థావరాలు ఉండటం వల్ల ఫైటర్ జెట్ల మోహరింపులో భారత్ ముందుంది. ఈ క్రమంలోనే తన బలాన్ని పెంచుకునేందుకు ఎల్ఏసీ సమీపంలో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మోహరించింది చైనా.
ఇదీ చూడండి: చైనా దూకుడుకు కళ్లెం వేసే 'ఈగల్'