ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నికలేవైనా ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలింగ్ శాతంలో ముందువరుసలో ఉంటుంది. ఉభయ జిల్లాల్లోని 10 నియోజకవర్గాల్లో ఖమ్మం మాత్రం కాస్త వెనుకే. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఖమ్మం పరిధిలోనే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ఎన్నికలపై నగర ఓటర్లు అంతగా ఆసక్తి చూపలేదు. విద్యావంతుల్లో చాలా మంది ఓటుహక్కు వినియోగించుకోలేదు. అలాంటివి ప్రతీ ఎన్నికల్లోనూ సాధారణంగా జరిగేవే.
ఏ ఎన్నికైనా వెనకంజే..
2018 డిసెంబర్ 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 86.51 శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం నియోజకవర్గంలో మాత్రం 73.98 శాతానికే పరిమితమైంది. మిగతా 9 నియోజకవర్గాల్లోనూ 85 శాతానికి మించి పోలింగ్ జరిగింది. పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల పోలింగ్లోనూ ఖమ్మం వెనుకంజలోనే ఉంది. 2019 ఏప్రిల్ 11న జరిగిన లోక్సభ ఎన్నికలో జిల్లాలో అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో 82.95 శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం మాత్రం 65.44 శాతానికే పరిమితమైంది. ఆ ఎన్నికలోనూ జిల్లాలోనే తక్కువ పోలింగ్ శాతం ఖమ్మంలోనే ఉంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోనే తక్కువగా ఖమ్మం పరిధిలో 71.38 శాతం పోలింగ్ నమోదైంది.
అప్పుడే 70 శాతం... మరిప్పుడు...?
గత కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం 67.68 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 2016 మార్చి 6న నగరపాలక సంస్థకు గత ఎన్నికలు జరిగ్గా.. మొత్తం 2 లక్షల 65వేల 710 ఓట్లు నమోదయ్యాయి. అందులో లక్షా 79వేల 827 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పుడే పోలింగ్ 70 శాతం దాటలేదు. ఈ నెల 30న జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలకు చాలా తేడానే ఉంది. ఈసారి ఓటర్ల సంఖ్య మరింత పెరిగి.. 2లక్షల 81వేల 387 మందికి జాబితా చేరింది. వీళ్లలో లక్షా 35వేల 734 మంది పురుషులు.. 1లక్షా 45వేల 608 మంది మహిళలు, ఇతరులు 45 మంది ఓటర్లుగా ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల ఘట్టం చకాచకా సాగిపోగా... ప్రచారపర్వానికి 10 రోజులు కూడా సమయం దొరకలేదు. కరోనా భయం వల్ల భౌతికదూరం పాటించేలా ఓటర్లు జాగ్రత్త పడ్డారు. ఎవర్నీ ఇంటి గేటుదాటి లోనికి రానివ్వలేదు. కనీసం గుర్తులు కూడా చూపించి దగ్గరగా వెళ్లి ప్రచారం చేసుకునే అవకాశం దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 30న జరిగే పోలింగ్కు ఓటర్లు కదులుతారా..? అనేది రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగాన్ని తొలుస్తున్న ప్రశ్న.
అవగాహన కల్పిస్తేనే...
గత కార్పొరేషన్ ఎన్నికల్లో సాధారణ పరిస్థితుల్లోనే 70 శాతానికి మించి పోలింగ్ జరగలేదు. ఈసారి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ జరుగుతుండగా.. అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీల చొరవ తప్పనిసరి కానుంది. పోలింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, మార్గదర్శకాలపై ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందిస్తే పోలింగ్ శాతం ఆశించిన మేర జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.