హైదరాబాద్లో ఇప్పటివరకు 613 డెంగ్యూ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు తెలిపారు. మలేరియా కేసులు కూడా అత్యధికంగా నమోదు అవుతున్నాయని అన్నారు. ఈ సీజన్లో ప్రతి నెలా లక్ష నుంచి 2 లక్షల వైరల్ ఫీవర్ కేసులు వస్తున్నాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల డెంగ్యూ కేసులు నమోదు అయినట్లు వివరించారు. డెంగ్యూ చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయని అన్నారు. ప్లేట్లెట్స్, చికిత్స పేరిట భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పారు. ఏమైనా సమస్యలు తలెత్తితే 104కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
కరోనా పూర్తిగా పోలేదు
కొత్త వేరియంట్ వస్తేనే మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. కొవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదని అన్నారు. అక్టోబర్ నెలాఖరుకు మరికొంత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలో చాలా తక్కువగా కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.4 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. పిల్లలను విద్యాసంస్థలకు పంపవచ్చని తల్లిదండ్రులకు సూచించారు. 1.15 లక్షల విద్యార్థులకు పరీక్షలు చేస్తే 55 మందికి పాజిటివ్ వచ్చినట్లు వివరించారు.