ఈ నెల 31 లోగా ప్రభుత్వ విభాగాల్లోని అన్ని క్యాటగిరిలలో పదోన్నత్తుల ప్రక్రియపూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సీనియర్ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. కారుణ్య నియామకాలు చేపట్టాలని సూచించారు.
ఏర్పాటు చేసుకోవాలి
పదోన్నతులకు సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఏదైనా సమస్యలుంటే సంబంధిత ప్రధాన శాఖాధిపతులకు, ప్రిన్సిపాల్ కార్యదర్శుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.
సన్నద్ధమవ్వండి
ధరణి పార్ట్-బి లో ఉత్పన్నమయ్యే అన్ని రకాల ల్యాండ్ రెవిన్యూ కేసులను రెండు మాసాలలో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. వీలైనంత వేగంగా డంప్ యార్డ్లు, వైకుంఠ ధామాలు ప్రజలకు వినియోగంలోకి తేవాలన్నారు. త్వరలో కోవిడ్ వ్యాక్సినేషన్.. ఫ్రంట్ లైనర్స్కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని, వ్యాక్సినేషన్ వేయుటకు గుర్తించిన కేంద్రాలలో డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించాలని చెప్పారు.
త్వరలో ఏర్పాటు చేస్తాం
మెదక్ జిల్లాలో 550 గ్రామాలు, ఆవాస ప్రాంతాలకు గాను ఇంతవరకు 478 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసామని.. మిగతావి త్వరలో ఏర్పాటు చేయుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిద్ధిపేట ఇంఛార్జ్ కలెక్టర్ పి. వెంకట్రామరెడ్డి తెలిపారు. అలాగే 469 గ్రామాలలో నర్సరీలు ఏర్పాటు చేసి 53 లక్షల 25 వేల మొక్కలను పెంచుటకు బ్యాగులు నింపడం జరిగిందన్నారు.
ఇదీ చదవండి:50వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం: హరీశ్ రావు