విలక్షణ నటనతో వెండి తెరపై కథానాయకుడిగా వెలుగొందుతున్న కమల్ హాసన్ రాజకీయాల్లో సిసలైన నాయకుడిగా ఎదగడంపై దృష్టిసారించారు! తాను స్థాపించిన 'మక్కల్ నీది మయ్యమ్' పార్టీని తొలిసారిగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దించారు. కోయంబత్తూరు (దక్షిణ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కమల్ తమ అభ్యర్థుల గెలుపు బాధ్యతను తన భుజాల మీద వేసుకొని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. కమల్ 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ పార్టీని భాజపా రెండో జట్టుగా కొంతమంది అభివర్ణిస్తుండటం సహా గృహిణులకు వేతనం, రిజర్వేషన్లు తదితర పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ విశేషాలివీ..
గృహిణులకు నెలవారీ వేతనం ఇస్తామని మీ పార్టీ హామీ ఇచ్చింది. మహిళా సాధికారతకు అది వ్యతిరేకం అని విమర్శలొస్తున్నాయి? వాటిపై ఏమంటారు?
కమల్: దేశ ఆర్థిక రంగంలో గృహిణులది కీలక పాత్ర. తమ పనులు తాము చేయడం ద్వారా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదలకు వారు దోహదపడుతున్నారు. మేమిచ్చిన హామీ.. వారి సేవలకు గుర్తింపు. ఇంటి పనులు చేసినందుకు డబ్బులిస్తామని చెప్పినంత మాత్రాన.. వారు బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నామనే పెడార్థాలు తీయడం సరికాదు. గృహిణులు తమ చదువు కొనసాగించవచ్చు. ఉద్యోగం చేయొచ్చు. మేం వారికి ఇవ్వాలనుకుంటున్న వేతనాన్ని పెట్టుబడి కోణంలోనే చూడాలి. కార్మికులకు రోజుకు ఎనిమిది గంటల పని మాత్రమే ఉండాలన్న ప్రతిపాదన వందేళ్ల క్రితం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గృహిణులకు వేతనాల విషయమూ అంతే. వారికి జీతం ఇస్తే తప్పేంటి? నిజానికి అది వారి హక్కు అని నేను భావిస్తున్నా.
రిజర్వేషన్లపై మీ అభిప్రాయం?
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకు రిజర్వేషన్లు దోహదపడతాయి. కానీ, దాన్ని రాజకీయ క్రీడగా మార్చొద్దు. మనది సమ్మిళిత సమాజం. దానిలో అందరికీ స్థానం, ప్రాధాన్యత ఉండాలి. ఆ దిశగా మనమంతా కృషి చేయాలి.
సేవా హక్కు చట్టం గురించి మీరు ఇటీవల మాట్లాడారు. దాన్ని కాస్త వివరిస్తారా?
ప్రభుత్వ సేవలను పొందడం ప్రజల హక్కు. అదేమీ రాజకీయ నాయకుల భిక్ష కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా.. ప్రభుత్వ సేవలను పొందడం తమ హక్కు అని ప్రజలకు తెలియకపోవడం, దాన్ని తెలియజేప్పేలా చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి ఉండటం బాధాకరం. ప్రజల్లో దీనిపై అవగాహన పెంచాలి. 'ఇది మీ బాధ్యత. వచ్చి పని చేయాల్సిందే' అని తెగేసి చెప్పినప్పుడే రాజకీయ నాయకులు ఆ పని పూర్తి చేస్తారు.