తన బావి కనిపించట్లేదని.. ఎక్కడుందో తెలుసుకునేందుకు సహాయం చేయాలని ఓ రైతు అధికారులకు లేఖ రాశాడు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా ఇందుకు కారణం లేకపోలేదు. బాధిత రైతు పేరు మీద అధికారులు నకిలీ బిల్లును ప్రవేశపెట్టి అతడి నుంచి డబ్బు తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని బెల్గాం జిల్లా మవీనాహోండ గ్రామంలో జరిగింది.
అసలు బావి లేకుండానే..
బావి కనిపించట్లేదంటూ అధికారులకు రైతు లేఖ బెండవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని మవీనాహోండలో నివసించే మల్లప్ప కుటుంబం ఓ బావిని తవ్వినట్టు అక్కడి పంచాయతీ అధికారులు గతేడాది నకిలీ బిల్లును ప్రభుత్వానికి సమర్పించారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ బిల్లుకు రూ.77,000 మల్లప్ప కుటుంబ సభ్యులకు అందాయి. ఇటీవల అధికారులు మల్లప్ప ఇంటికి చేరుకుని ఆ డబ్బును వసూలు చేసుకున్నారు.
అధికారుల తీరుపై ఆగ్రహించిన మల్లప్ప కులగుడె.. ఉన్నతాధికారులకు వ్యంగ్యంగా లేఖ రాశాడు. తన బావి కనిపించకుండా పోయిందని.. ఆచూకీ తెలుసుకునేందుకు తనకు సహాయం చేయాలంటూ లేఖలో పేర్కొన్నాడు. మల్లప్ప లేఖపై స్పందించిన కొత్త పంచాయతీ అధికారి కుంతీనాథ్ శిరాగొండా.. ఈ విషయంపై దర్యాప్తు చేస్తామన్నారు.
ఇదీ చదవండి : అత్తారింటికి హెలికాప్టర్లో వచ్చిన కోడలు