ఏ శ్మశాన వాటికలోనైనా.. చనిపోయాక సమాధిని తవ్వుతారు. కరోనా మహమ్మారి ప్రభావంతో గుజరాత్లోని సూరత్లో ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్కడ సమాధులను తవ్వేందుకు జేసీబీలను వినియోగిస్తున్నారు. మోరాభాగల్ శ్మశాన వాటికలో ఇప్పటికే 25 సమాధులను జేసీబీల సాయంతో తవ్వి సిద్ధం చేశారు.
5 రెట్లు అధికంగా..
గుజరాత్లో కరోనా వ్యాప్తి పెరుగుతుండగా.. కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. సాధారణ రోజుల కంటే.. ప్రస్తుతం 5 రెట్లు అధికంగా శ్మశాన వాటికలకు మృతదేహాలు వస్తున్నాయి. కరోనా భయంతో సమాధుల్ని తవ్వేందుకు జనం ముందుకు రావటం లేదు. అంతేగాకుండా.. సమాధుల తవ్వకానికి గంటల తరబడి శ్మశానాల్లో వేచి ఉండాల్సి వస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా.. జేసీబీలను వినియోగిస్తున్నారు.
సూరత్లో మూడు ప్రధాన శ్మశాన వాటికలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు రెండు లేదా మూడు మృతదేహాలు అక్కడకు వచ్చేవి. కానీ, ప్రస్తుతం ఆ సంఖ్య 8 నుంచి 10కి పెరిగిందని అంటున్నారు శ్మశాన నిర్వాహకులు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మృతదేహాలను తాము ఖననం చేస్తున్నామని వారు తెలిపారు.
ఇదీ చూడండి:రెస్టారెంట్లో ఎస్సై దౌర్జన్యం- బదిలీ వేటు