కర్నూలు నగరం మీదుగా... హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి- 44.. వెళుతోంది. హైదరాబాద్ నుంచి కడప, తిరుపతి, చెన్నై, అనంతపురం, బెంగళూరు
నగరాలకు వెళ్లేవారు ఈ మార్గం గుండానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. భాగ్యనగరం వైపు నుంచి కర్నూలు నగరంలోకి ప్రవేశించగానే... వెంకటరమణ కాలనీ వద్ద తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దుమ్ము- ధూళితో ఆ ప్రాంతం నిండిపోతోంది. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఆ కొద్ది దూరం నరకప్రాయం అవుతోంది. హైవే కావటంతో... వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం... హైవేపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్.
హైవేపై వెళ్లే వాహనాలకు ఎలాంటి అంతరాయం ఉండకూడదన్న ఉద్దేశంతో... వెంకటరమణ కాలనీ సమీపంలో ఫ్లైఓవర్ పనులను జాతీయ రహదారుల సంస్థ- ఎన్హెచ్ఏఐ మూడేళ్ల క్రితం ప్రారంభించింది. పనులు మొదట్లో బాగానే జరిగినా.. రెండేళ్లుగా ఆగిపోయాయి. దీంతో... ఆ ప్రాంతంలోని వాహనదారులకు అవస్థలు తప్పటం లేదు. హైవే నుంచి... వెంకటరమణ కాలనీకి వెళ్లే మార్గం మూసివేయటంతో... వ్యాపారాలు లేక దుకాణాలు మూతపడ్డాయి. హైవేపై ఉన్న పలు దుకాణాలు దుమ్ముతో నిండిపోతున్నాయి. సర్వీసు రోడ్లు సైతం సరిగాలేకపోవటంతో... రాకపోకలు సాగించటం ఇబ్బందిగా మారింది. రాత్రిపూట వీధిలైట్లు సైతం లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండీ.. కాకినాడలో కార్పొరేటర్ హత్య.. 'పాత కక్షలే కారణం'