తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ ఎదుట మహిళా సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఎస్సైపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ పట్ల ఎస్సై దురుసుగా ప్రవర్తించడం వల్లే.. ఆ వ్యక్తి దూషించాడని మహిళా సంఘాలు నేతలంటున్నారు.
నాలుగు రోజుల క్రితం వొమ్మంగి గ్రామంలో ఓ స్థల వివాదం జరుగుతుంటే.. ప్రత్తిపాడు ఎస్సై రవికుమార్ అక్కడికి వెళ్లాడు. వివాద ఘటనను ఓ మహిళ మొబైల్లో చిత్రీకరించింది. ఎస్సై చూడడంతో ఆమె చరవాణిని దుస్తులలో దాచిపెట్టింది. అది గమనించిన అతను అక్కడికి వెళ్లి ఆమె దుస్తుల్లో దాచిపెట్టిన మొబైల్ తీసుకున్నాడు. అంతేగాక ఇష్టమొచ్చినట్లు తిట్టాడని బాధితురాలు కన్నీరుమున్నీరయింది. అందరూ చూస్తుండగానే ఎస్సై ఇలా చేశాడని, అది చూసిన తన భర్త తనను పుట్టింట్లోనే వదిలేసి వెళ్లిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ వివాదంపై సదరు కుటుంబీకులు శంకర్లపూడి గ్రామానికి చెందిన కుల పెద్ద ఎపూరి శ్రీను వద్దకు వెళ్లారు. శ్రీను ఎస్సైపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అది సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. దీంతో పోలీసులు శ్రీనుని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న మహిళా సంఘాల నేతలు పెద్దసంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఎస్సై దురుసుగా ప్రవర్తించడం వల్లే శ్రీను తిట్టాడని మహిళలు తెలిపారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని .. మహిళాసంఘాల నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి. 'వైకాపా నేతలు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు'